అందరూ సమైక్యంగా ఉంటే కలిగే ఆనందం గురించి పేర్కొంటోంది ఆండాళ్మాత ఇరవై ఏడో పాశురంలో. ఈ కలసి ఉండడం అనేది ప్రజలంతా వారిలోవారు గాక, భగవంతుడితో కూడా కలసి ఉండాలని అనడం ఇక్కడి విశేషం.
భగవంతుడితో కలిసి ఉండాలంటే సన్మార్గాన్ని ఆచరించాలి. అలా అంతా మంచి దారిలో నడచుకుంటే వ్యక్తిగత, సామాజిక సంక్షేమానికి కొదవే ఉండదు.
'కూడారై వెల్లుమ్ శీర్ గోవిన్దా! ఉన్దన్నై
ప్పాడిప్పఱైయామ్ పెఱుశెమ్మానమ్
నాడుపుగుళుమ్ పరిశినాల్ నన్రాగ
చ్చూడగమే తోళ్ వళైయే, తోడు శెవిప్పూవే,
పాడగమే, యెన్రనైయపల్కలనుమ్ యామణివోమ్
ఆడై యడుప్పోమ్, అదన్ పిన్నే పాల్శోఱు
మూడనెయ్ పెయ్దు ముళ్గవళివార
కూడి యిరున్దు కుళిర్న్దేలో రెమ్బావాయ్'
శ్రీకృష్ణా నిన్ను కీర్తించి 'పఱై' అనే వాద్య విశేషాన్ని పొంది నీవిచ్చే విలువైన బహుమతులతో మేమంతా ఆనందంగా ఉండాలి. చేతికంకణాలు, భుజకీర్తులు, కర్ణాభరణాలు, కాలిఅందెలు ఇంకా ఇలాంటి అనేకానేక విలువైన వస్త్రాలు, ఆభరణాలను ధరించి నీతో కలిసి నేతిలో మునిగిన క్షీరాన్నాన్ని మేమంతా హాయిగా ఆరగించాలి. ఇదే వ్రతఫలమని మేం భావిస్తున్నాం అంటోంది ఆండాళ్మాత. తొలిపాశురం నుంచి గోదాదేవి శ్రీకృష్ణ పూజకు ఎంతో భక్తిపరవశ హృదయంతో గోపికలనందరినీ చైతన్యపరచింది. కృష్ణ దర్శనంతో తానుపడ్డ శ్రమనంతా పోగొట్టుకుంది. వ్రతానికి కావలసిన ఉపకరణాలను కృష్ణుడే ప్రసాదించాలని వేడుకొంది. గోదామాత ప్రార్థనలకు ఆనందించాడు గోకులవర్థనుడైన కృష్ణుడు. ఆమె కోరినవీ, కోరనవీ కూడా అనుగ్రహించదలచాడు. అంతగా కృష్ణపరమాత్మ మెప్పును పొందింది ఆండాళ్మాత. ఆమె అడిగిందే తడవుగా శ్రీకృష్ణుడు తన పాంచజన్య శంఖాన్ని, గోవులను మరల్చడానికి ఉపయోగించే శంఖాన్ని, దేవాలయాల్లో ఆరాధన సమయంలో పూరించే శంఖాన్ని స్వీకరించమని చెప్పాడు. ఆ తర్వాత చాలా పెద్దదైన పఱై అనే వాద్యపరికరం కావాలని కోరింది.అప్పుడు తాను త్రివిక్రమావతారంలో త్రివిక్రముడి విజయాన్ని చాటుతూ జాంబవంతుడు మోగించిన పఱై, రావణ సంహార అనంతరం విజయ సూచకంగా వినియోగించిన పఱై, కృష్ణావతారంలో నాట్యం చేసేటప్పుడు మోగించిన పఱైలను ఇస్తానన్నాడు.
ఇలా అన్నీ వారడిగినవెంటనే ఎంతో ఉత్తమోత్తమమైనవి ప్రసాదించాడు శ్రీకృష్ణుడు. అన్నీ బాగానే ఉన్నాయి. వ్రతఫలితం మాత్రం మాకు ఇంతకంటే బాగుండాలి అని అంది ఆండాళ్మాత. తిరుప్పావై వ్రతానికి తగిన ఉత్తమఫలమైన ఓ వరాన్ని ఆమె కోరింది. అదే కృష్ణుడితో కలసి అంతా క్షీరాన్నాన్ని భుజించడం... ఆ క్షీరాన్నం కూడా నేతిలో మునిగి ఉండాలంటోంది ఆమె . ఇలాంటి పుష్టికరమైన తిండి భోగభాగ్యాలకు గుర్తు. అంటే వ్రతం చేసిన ఏ ఒకరిద్దరోకాక అంతా కలసికట్టుగా భగవంతుడిని ముందుంచుకొని ఆయన తింటుంటే తామూ తినగలగాలట. కోరిక వెనుక ఎంతో నిస్వార్థం, సమసమాజ ప్రగతి లక్ష్యం అన్నీ మనకు కనిపిస్తాయి.
| Comments |
|
3.26 Copyright (C) 2008 Compojoom.com / Copyright (C) 2007 Alain Georgette / Copyright (C) 2006 Frantisek Hliva. All rights reserved."
- పొగడ్త అగడ్తే
- విత్తొకటి చెట్టొకటి కాదు
- సున్నం ఒకడికి వెన్న ఇంకొకడికి అన్నట్టు
- పగటి ముచ్చట పని చేటు
- అనుకూల దాంపత్యం























