Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్రముఖ ఓటీటీలో రిలీజ్ కి నోచుకోని యాక్షన్ హీరో సినిమా…?

ప్రముఖ ఓటీటీలో రిలీజ్ కి నోచుకోని యాక్షన్ హీరో సినిమా…?


టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ నటించిన ”ఆరడుగుల బుల్లెట్” సినిమా ఓటీటీలో రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తోంది. సీనియర్ మాస్ డైరెక్టర్ బి. గోపాల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాని జయ బాలాజీ రియల్ మీడియా బ్యానర్ పై తాండ్ర రమేష్ నిర్మించారు. వక్కంతం వంశీ స్టోరీ – స్క్రీన్ ప్లే అందించాడు. స్టార్ హీరోయిన్ నయనతార గోపీచంద్ కు జోడీగా నటించింది. ఎప్పుడో చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని అనేక వాయిదాల తర్వాత 2017 జూలై 16న విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే అనుకోని కారణాల వల్ల ఈ మూవీ రిలీజ్ కాలేదు. ఇప్పటికి మూడేళ్లు అవుతున్నా ‘ఆరడుగుల బుల్లెట్’ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఇప్పుడు డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ పుణ్యమా అని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోందని తెలుస్తోంది.

కాగా ఇటీవల టాలీవుడ్ లో చాలా సినిమాలు ఓటీటీలలో విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. థియేటర్స్ ఎప్పుడు రీ ఓపెన్ చేస్తారనే దానిపై క్లారిటీ లేకపోవడంతో ఇన్నాళ్లు వెయిట్ చేసిన సినిమాలన్నీ ఓటీటీ బాట పడుతున్నాయి. ఇప్పుడు ఇదే రిలీజ్ కి నోచుకోని సినిమాలకి హెల్ప్ అయింది. ఈ క్రమంలో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్’ సినిమాని ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ ‘జీ 5 ఒరిజినల్’ లో విడుదల చేయబోతున్నారట. ఈ సినిమా కోసం 7 నుంచి 8 కోట్లకు మధ్య డీల్ కుదుర్చుకున్నట్లు ఓటీటీ వర్గాల్లో అనుకుంటున్నారు. ఇక ఈ చిత్రాన్ని దసరా ఫెస్టివల్ సీజన్ లో స్ట్రీమింగ్ కి పెట్టనున్నారని సమాచారం. గోపీచంద్ మాస్ ఇమేజ్.. మాస్ ఆడియన్స్ లో బి. గోపాల్ క్రేజ్.. నయనతార గ్లామర్.. మణిశర్మ సంగీతం ఈ చిత్రానికి వ్యూయర్ షిప్ తెస్తుందని ఓటీటీ వారు భావిస్తున్నారట. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.