సోషల్ మీడియాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే దాని పర్యవసానం ఎలా ఉంటుందో మరోసారి సైబర్ క్రైమ్ పోలీసులు కత్తి మహేష్ కి రుచి చూపించారు. కత్తిని రెండోసారి అరెస్ట్ చేసి సౌండ్ లేకుండా చేశారు. హిందూ దేవుడు శ్రీరాముడిపై అసభ్యకరమైన పోస్ట్ లు పెట్టడంతో కొద్దిరోజుల క్రితం కత్తి మహేష్ ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే మరోసారి శ్రీరాముడిపై వివాదాస్పద పోస్ట్ పెట్టి బుక్కయ్యాడు. రెండోసారి కత్తి మహేష్ పై పోలీస్ విచారణ సాగుతోంది.
రాముడు కరోనా ప్రియుడు.. అంటూ జోక్ చేయడంతో ఫిర్యాదు అందుకున్న పోలీసులు అతడిని ఇదివరకూ ఓసారి అరెస్టు చేశారు. అయినా కత్తి తన వైఖరి మార్చుకోకపోగా మరోసారి కూడా శ్రీరాముడిని నిందిస్తూ మరో పోస్టును పెట్టాడు. ఇదివరకూ పోలీసులు కత్తి మహేష్ పై ఐపీసీ సెక్షన్ 154 కమ్యూనల్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసులో నాంపల్లి కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. ఇంకా జైల్లోనే ఉన్నా.. మరోసారి ఇలా పీటీ వారెంట్ పై పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
2020 ఫిబ్రవరిలో ఇదే తరహా ఫిర్యాదును పోలీసులు అందుకున్నారు. 2018లో రాముడిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందున కత్తి మహేష్ నగర బహిష్కరణకు గురైన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి అతడిని దూరంగా తరలించారు. తాజా పరిణామం చూస్తుంటే దేవుళ్లపై కత్తికి ఎందుకింత వెగటు? అంటూ సామాన్యుల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. కత్తి శ్రీరాముడిని వదలడు.. కత్తిని పోలీసులు వదలరా? అంటూ ఒకటే ముచ్చట వేడెక్కిస్తోంది.