తమిళ హీరో శరత్ కుమార్ ముద్దుల కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ తీరే వేరు. హీరోకి కూతురైనా తను హీరోయిన్ గా మాత్రమే నటించాలని కాకుండా విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ విలక్షణ నటిగా ప్రత్యేక గుర్తింపుని దక్కరించుకుంది వరలక్ష్మీ. ప్రస్తుతం హీరోయిన్ గా నటించే అవకాశం వున్నా విలక్షణ పాత్రల్లో నటిస్తోంది. వరలక్ష్మీ నటిస్తున్న తాజా చిత్రం `క్రాక్`.
మాస్ రాజా రవితేజ హీరోగా నటిస్తున్న చిత్రమిది. గోపీచంద్ మలినేని ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఠాగూర్ మధు భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శృతిహాసన్ ఈ మూవీతో రీఎంట్రీ ఇస్తోంది. నెల్లూరులో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో వరలక్ష్మీ శరత్ కుమార్ జయమ్మగా పవర్ ఫుల్ పాత్రలో నటిస్తోంది.
గత ఏడు నెలలుగా లాక్ డౌన్ కారణంగా ఆగిపోయిన ఈ మూవీ షూటింగ్ ఇటీవలే రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రారంభమైంది. ఈ రోజు (బుధవారం) జయమ్మ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని టీమ్ ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. సెట్లో దర్శకుడితో కలిసి వరలక్ష్మీ ఫొటోలకి పోజులిచ్చింది. ఈ మూవీని ఈ సంక్రాంతికి రిలీజ్ చేయబోతున్నారు.