Templates by BIGtheme NET
Home >> Cinema News >> కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ టీజర్…!

కార్తికేయ ‘చావు కబురు చల్లగా’ టీజర్…!


‘Rx 100’ సినిమాతో యూత్ లో తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న కార్తికేయ గుమ్మకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ”చావు కబురు చల్లగా”. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఈ చిత్రం ద్వారా పెగళ్ళపాటి కౌశిక్ అనే కొత్త దర్శకుడు టాలీవుడ్ కు పరిచయం అవుతున్నాడు. లక్కీ బ్యూటీ లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రంలో కార్తికేయ ‘బస్తీ బాలరాజు’ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదలై విశేషంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలో నేడు (సెప్టెంబర్ 21) కథానాయకుడు కార్తికేయ పుట్టినరోజు కానుకగా ‘చావు కబురు చల్లగా’ టీజర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్.

ఈ టీజర్ లో ఫోన్ కాల్ తో నిద్ర లేచిన హీరోకి అవతలి వైపు నుంచి ‘మా బంధువొకరు చనిపోయారు.. స్మశానానికి తీసుకెళ్లాలి.. మేం దేవుడి బిడ్డలం. మరి మీరు మా వాళ్ళను తీసుకెళ్తారా?’ అని అడుగగా.. ‘డబ్బులిత్తే ఎవరి బిడ్డలనన్నా తీసుకెళ్లామ్.. అడ్రెస్ చెప్పండి’ అని కార్తికేయ సమాధానం చెప్తాడు. దీనిని బట్టి ఈ మూవీలో హీరో వ్యాన్ లో స్మశానానికి శవాలను తీసుకెళ్లే పాత్రలో కనిపిస్తాడని తెలుస్తోంది. ‘నేను రోజూ సావులకు బోతా.. దీనమ్మ అందరి ఏడుపులు చూసి చూసి ఏడుపంటేనే సిరాకు దొబ్బింది.. కానీ ఆ పిల్ల ఏడుత్తుంటే మాత్రం.. చేతికున్న ఎంట్రుకలు ఇట్టా లెగిసి నిలుచున్నాయిరా’ అని కార్తికేయ చెప్పే డైలాగ్ సినిమాపై ఆసక్తిని కలిగిస్తోంది. ఇక సీనియర్ నటి ఆమని ‘ఎదవ నాయాలా.. శవాన్ని తోలుకుపోరా అంటే.. మొగుడు పోయిన దాన్ని కెలికొచ్చాడు’ అంటూ హీరోను తిడుతోంది. దీనికి ‘ఆడెట్టా పోయాడు కదే.. ఇప్పుడది ఖాళీనే’ అంటూ కార్తికేయ చెప్పడం నవ్వు తెప్పిస్తోంది. ఈ సినిమాలో కార్తికేయ ఊర మాస్ లుక్.. బాడీ లాంగ్వేజ్.. మాట్లాడే తీరు ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమాతో నటన పరంగా కార్తికేయ మరో మెట్టు ఎక్కేలా కనిపిస్తున్నాడు.

కాగా ‘చావు కబురు చల్లగా’ లో ఆమని – శ్రీకాంత్ అయ్యంగర్ – మహేష్ – భద్రం తదితరులు ఇతర ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బిజోయ్ సంగీతం అందించగా సునీల్ రెడ్డి కెమెరామెన్ గా వ్యవహరిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. త్వరలోనే మరో షెడ్యూల్ షూటింగ్ ప్రారంభించి శరవేగంగా చిత్రీకరణ పూర్తి చేసే దిశగా ప్లాన్ చేస్తున్నట్లుగా మేకర్స్ తెలిపారు.