Templates by BIGtheme NET
Home >> MOVIE NEWS >> దేవర ఫ్యాన్స్ అలా బండ్ల మెడపై కత్తి పెట్టి..!

దేవర ఫ్యాన్స్ అలా బండ్ల మెడపై కత్తి పెట్టి..!


“నా మాట.. నా బాట.. నీ కాడకే కదా నా దేవరా.. నా ఊపిరి నీకు దాసోహం.. నా తనువు నీకు దేవళం .. నా దేవరా..“ ..అంటూ నటుడు కం నిర్మాత బండ్ల గణేష్ కవిత అల్లిన సంగతి తెలిసిందే. తన దేవుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ని తలవగానే అతడు కాళిదాసు అయిపోతుంటాడు. అంతగా ఆరాధిస్తూ కవితలు రాస్తూ బోలెడంత వినోదం పంచుతున్నారు బండ్ల.

కానీ అదేమిటో కానీ తన దేవర స్వయంగా బండ్ల గణేష్ మెడకు కత్తి ఎక్కుపెట్టి చంపేస్తానని వార్నింగ్ ఇస్తున్న ఓ ఫోటో ప్రస్తుతం అంతర్జాలంలో వైరల్ గా మారింది. ఇంతకీ ఈ ఫోటో ఎక్కడిది? అంటే బండ్ల గణేష్ కి నేరుగా పవన్ కల్యాణ్ అభిమాని ఒకరు ఈ ఫోటోని సోషల్ మీడియాల్లో షేర్ చేసి “మీరు పవన్ కళ్యాణ్ కోసం బ్లాక్ బస్టర్ ఇవ్వకపోతే ఇది జరుగుతుంది“ అని ఆ ఫోటోకు శీర్షిక పెట్టాడు. ఈ పోస్ట్ ట్విట్టర్ లో వైరల్ అయ్యింది. బండ్లా వెంటనే స్పందిస్తూ..“సరే“ అని బ్రొటనవేళ్లు ఇమోజీలతో సమాధానం ఇచ్చాడు. ఈ ఫన్నీ పరిహాసము ఇప్పుడు నెటిజనుల దృష్టిని ఆకర్షించింది.

పవన్ కల్యాణ్ హీరోగా గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించిన బండ్ల గణేష్ ఆ తర్వాత అతడి కాల్షీట్ల కోసం చాలా కాలంగా వేచి చూస్తున్నాడు. సినిమా చేయాలని తపిస్తున్నాడు. కానీ ఎందుకనో వీలు కుదరడం లేదు. త్వరలోనే తన దేవుడు పవన్ తో సినిమా చేస్తానని బండ్ల ట్విట్టర్ ఇంటరాక్షన్స్ లో చెప్పినప్పుడు అభిమాని పైవిధంగా స్పందించారన్నమాట. ఫన్నీగా ఉన్నా కానీ అది సీరియస్ వార్నింగే. పవన్ అభిమానులతో తేడాలొస్తే ఎవరికైనా అంతేగా! సాధ్యమైనంత తొందర్లోనే బండ్ల పవన్ తో సినిమా చేయాలని ఆకాంక్షిద్దాం.

కానీ పవన్ షెడ్యూల్స్ చూస్తే.. ఇప్పటికిప్పుడు మూడు వరుస చిత్రాలను పూర్తి చేయాల్సి ఉంది. క్రిష్-ఏ.ఎం.రత్నంతో హరిహర వీరమల్లు చిత్రీకరణ పూర్తవుతోంది. అలాగే అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ లో రానాతో కలిసి నటిస్తున్నారు. తదుపరి హరీష్ శంకర్ తో సినిమా చేయాల్సి ఉంది. ఇవన్నీఅయ్యాక బండ్ల గణేష్ ను తన దేవుడు కరుణిస్తారేమో!

అయ్యప్పనుం .. జరంత వేగంగా..!

సెకండ్ వేవ్ రిలీఫ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం పవన్ – రానా బృందం అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ని శరవేగంగా పూర్తి చేయనున్నారని తెలుస్తోంది. ఇంతకుముందు కొన్ని సన్నివేశాలను తెరకెక్కించాక సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం షూటింగ్ ఈ నెల 12 నుంచి తిరిగి ప్రారంభమైంది. ప్రారంభమే యాక్షన్ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈసారి ప్రత్యేకత ఏమిటంటే ఈ యాక్షన్ సన్నివేశం ఈ చిత్రంలో పవన్ పరిచయ సన్నివేశం కానుందని తెలిసింది. సితార ఎంటర్ టైన్ మెంట్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో నిత్యా మీనన్ ఓ కీలక పాత్ర పోషించనుంది.

మాతృక లో పృథ్వీరాజ్ – బిజు మీనన్ లాంటి స్టార్లు పోషించిన పాత్రల్లోనే పవన్ – రానా నటిస్తున్నారు. ఇక ఈ మూవీ ఆద్యంతం ఆ ఇద్దరి మధ్యా ఘర్షణ రక్తి కట్టిస్తుంది. తెలుగు వెర్షన్ లో పవన్ – రానా మధ్య సీన్స్ ని సాగర్ చంద్ర రక్తి కట్టించేలా తీర్చిదిద్దనున్నారని తెలిసింది. ఇక ఈ మూవీకి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరానువాద పర్యవేక్షకుడిగా ఉన్నారు. త్రివిక్రమ్ ఈ చిత్రానికి స్వయంగా మాటలు అందిస్తున్నారు.