Templates by BIGtheme NET
Home >> Telugu News >> రూ.2వేల నోటుకు మంగళం..అంతా రూ.500నోటే!

రూ.2వేల నోటుకు మంగళం..అంతా రూ.500నోటే!


దేశంలో పెద్దనోట్లను రద్దు చేసి ఓ ఉత్పాతాన్ని సృష్టించిన ప్రధాని నరేంద్రమోడీ ఆ తరువాత కొత్త నోట్లను దేశంలో ప్రవేశపెట్టారు. పాత రూ.1000 నోటు – రూ.500 నోట్లను రద్దు చేసి కొత్తగా వాటి స్థానంలో రూ.2000 నోటును ప్రవేశపెట్టారు. ఈ క్రమంలోనూ దాని ముద్రణను తగ్గిస్తూ గత ఏడాది నుంచి ఇప్పుడు రూ.2వేల నోటు ముద్రణను పూర్తిగా నిలిపివేశారు.

రూ.2016-17లో ఏకంగా రూ.354.29 కోట్ల రూ.2వేల నోట్లను భారత రిజర్వ్ బ్యాంక్ ముద్రించింది. గత ఏడాది నుంచి పూర్తిగా రూ.2వేల నోట్ల ముద్రణను నిలిపివేసింది. బ్లాక్ మనీ కట్టడిలో భాగంగా ఈ చర్యలు తీసుకుంది. కరెన్సీ నోట్ల వివారాలపై ఆర్టీఐ కార్యకర్త జలగం సుధీర్ చేసిన దరఖాస్తుకు సమాధానంగా ఆర్బీఐ ఈ సమాధానం ఇచ్చింది.

పెద్ద నోటు రూ.2వేల ముద్రణను పూర్తిగా ఆపేసిన కేంద్రం పూర్తిగా డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తోంది. ఈ క్రమంలోనే రూ.500నోట్లను మాత్రం భారీగా ముద్రిస్తోంది. 2016-17తో పోలిస్తే గత ఏడాది ఏకంగా రెట్టింపు స్థాయిలో రూ.500 నోట్లను ప్రింటింగ్ చేసింది. నాలుగేళ్ల క్రితం రూ.429.22 కోట్ల రూ.500 నోట్లను ముద్రించగా.. గత ఏడాది 822.77 కోట్ల నోట్లను ముద్రించింది. గత నాలుగేళ్లలో 7071.63 కోట్ల కొత్త నోట్లను ఆర్బీఐ ముద్రించింది.

ఇక రూ.10 – 50 – 100 – 200 నోట్ల ప్రింటింగ్ ను ఆర్బీఐ తగ్గించింది. నాణేలు అందుబాటులోకి తేవడంతో రూ.1 – 2 – 5 నోట్లను పూర్తిగా ముద్రణ ఆపేసింది.

ఇక అన్ని నోట్ల కంటే రూ.200 నోటు ముద్రణకే ఎక్కువ ఖర్చు అవుతోందని ఆర్బీఐ తెలిపింది. దీనికి ఒక్క నోటుకు రూ.2.15 చొప్పున వెచ్చిస్తున్నారు. ఆ తరువాత రూ.500కు రూ.2.13 వెచ్చిస్తున్నారు. ఇక రూ.10నోటు ప్రింటింగ్ కు 75పైసలు ఖర్చు చేస్తోంది.