Discom Companies in Telangana: విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు కంపెనీల ప్రవేశానికి వీలు కల్పించే విద్యుత్ సవరణ బిల్లు–2022ను కేంద్రం లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును తెలంగాణతోపాటు దేశంలోని పలు రాష్ట్రాలు వ్యతిరేకించాయి. ఈ నేపథ్యంలో విస్తృత సంప్రదింపుల కోసం ప్లామెటరీ స్థాయీ సంఘానికి సిఫార్సు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విద్యుత్రంగ ప్రయివేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తూ లక్షలాది మంది విద్యుత్ రంగ ఉద్యోగులు తెలంగాణ వ్యాప్తంగా నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో డిస్కంల పరిస్థితిపై కేంద్రం వార్షిక ర్యాంకులు ప్రకటించంది. రేటింగ్లలో మ్ముడిగా సీ మైనస్ గ్రేడ్లో తెలంగాణ డిస్కంలు ఉన్నాయి. వేల కోట్ల రూపాయల నష్టాలతో 45, 38వ ర్యాంకులకే ఎన్పీడీసీఎల్, ఎస్పీడీసీఎల్ సంస్థలు పరిమితమయ్యాయి. ప్రతీ యూనిట్పై రూ.1.63 నుంచి రూ.1.31 వరకు నష్టపోతోంది. ఆర్థిక సుస్థిరత, పనితీరు సమర్థతలోనూ దిగజారిపోయింది.
పాతాళం లోతు నష్టాలు..
తెలంగాణలో విద్యుత్ పంపణీ సంస్థలు పాతాళంలోతు నష్టాల్లో కూరుకుపోయాయి. నెలనెలా అప్పులు తెచ్చి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన దుస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీలు రాక, వివిధ శాఖల్లో బిల్లులు పేరుకుపోవడంతో డిస్కంలు తిప్పలు పడుతున్నాయి . రాష్ట్ర ప్రభుత్వం నుంచే విద్యుత్ పంపిణీ సంస్థలకు సుమారు రూ.15 వేల కోట్ల బిల్లులు రావాల్సి ఉంది. ఇటు ఆదుకునే దిక్కు లేక, అటు ఇష్టమొచ్చినట్లు విద్యుత్ కొనుగోళ్లు చేయటం, నిర్వహణ లోపం, లెక్కలేనన్ని అప్పులు.. డిస్కంలను పీల్చిపిప్పి చేస్తున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే కొద్ది రోజుల్లోనే ఉన్న ఆస్తులను కూడా అమ్ముకోవాల్సి పరిస్థితి ఏర్పడనుంది.
రూ. 50 వేల కోట్లకు నష్టాలు..
నార్తర్న్ డిస్కం (ఎన్పీడీసీఎల్), సదరన్డిస్కం (ఎస్పీడీసీఎల్) రెండింటి నష్టాలు కలిపి గత ఏడాది మార్చి నాటికే రూ.42 వేల కోట్లు దాటి పోయాయి. విద్యుత్ సంస్థలు అధికారికంగా విడుదల చేసిన 2019–20 వార్షిక రిపోర్టులో ఈ విషయం వెల్లడైంది. ఈ లెక్కల ప్రకారం చూస్తే… డిస్కంల నష్టాలు ప్రస్తుతానికి రూ.50 వేల కోట్లకు చేరువయ్యాయి. కొత్త రాష్ట్రంలో విద్యుత్ వినియోగం రికార్డు స్థాయిలో పెరిగిందని, నిర్విరామంగా వ్యవసాయానికి ఫ్రీ కరెంట్ అందిస్తున్నట్లు చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలను నట్టేటా ముంచుతోంది. విద్యుత్ పంపిణీ వ్యయంతో పోలిస్తే బిల్లులు, ప్రభుత్వ సబ్సిడీల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండటమే నష్టాలకు కారణమని డిస్కంలు తమ నివేదికల్లో ప్రస్తావించాయి.
గుదిబండగా కాళేశ్వరం కరెంటు బిల్లు..
ఇరిగేషన్ ప్రాజెక్టులకు పెరిగిన విద్యుత్ వాడకం డిస్కంల పాలిట శాపంగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీళ్ల ఎత్తిపోతలకు మూడేళ్లలో రూ.2,400 కోట్ల కరెంట్ బిల్లు అయింది. మేడిగడ్డ నుంచి మూడు స్టేజీల్లో ఎల్లంపల్లికి, అక్కడి నుంచి రెండు స్టేజీల్లో మిడ్ మానేరుకు, అక్కడి నుంచి ఐదు స్టేజీల్లో కొండపోచమ్మసాగర్కు నీటిని ఎత్తిపోస్తున్నారు. భారీ మోటార్లతో లిఫ్టింగ్కు నిరుటి వరకు రూ.2,090 కోట్లు ఖర్చు కాగా, ఈ వానాకాలంలో ఎత్తిపోసిన నీళ్లకు ఇంకో రూ.300 కోట్ల వరకు కరెంట్ బిల్లు వచ్చింది. మొత్తంగా రూ. 2,400 కోట్ల కరెంట్ బిల్లుల్లో ఇప్పటి వరకు దాదాపు రూ.800 కోట్లు చెల్లించిన ఇరిగేషన్ విభాగం మిగతా రూ.1,600 కోట్లను పెండింగ్లో పెట్టింది. మరోవైపు వివిధ ప్రభుత్వ శాఖలు, ఆఫీసుల నుంచి డిస్కంలకు రావాల్సిన కరెంట్ బిల్లులు సుమారు రూ.11 వేల కోట్ల దాకా పెండింగ్లో ఉన్నాయి. 2019–20 ఏడాదంతా రాష్ట్రంలో విద్యుత్ అవసరాలకు రూ.35 వేల కోట్ల పవర్ విక్రయించిన డిస్కంలు బిల్లుల ద్వారా రూ.37 వేల కోట్లు రాబట్టుకున్నాయి. కానీ జీతాలకు రూ.3,700 కోట్లు, అప్పుల కిస్తీలు, నిర్వహణ ఖర్చుల పేరిట భారీ నష్టాలు చూపించాయి.
మిత్తీలకే తడిసి మోపెడు
డిస్కంలు ఇప్పటి దాకా చేసిన అప్పులను తీర్చేందుకు నానా తిప్పలు పడుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న ఎస్పీడీసీఎల్కు రూ. 14,167 కోట్ల అప్పులున్నాయి. వరంగల్లో ఉన్న ఎన్పీడీసీఎల్కు రూ. 9,701 కోట్ల అప్పులున్నాయి. మొత్తంగా రెండింటికీ కలిపి దాదాపు రూ. 24 వేల కోట్ల అప్పులు ఉన్నాయి. రెండు డిస్కంలు తెచ్చిన అప్పులు, వడ్డీలకు కలిపి నిరుడు రూ.2,115 కోట్లు చెల్లించాయి. ఇవి 2018–19తో పోలిస్తే రూ.300 కోట్లు పెరిగాయి. ఏటా పెరుగుతున్న వడ్డీల భారం డిస్కంల నడ్డి విరిస్తోంది. దేశంలోని డిస్కంలను రుణాల నుంచి గట్టెక్కించేందుకు కేంద్రం అమల్లోకి తెచ్చిన ఉదయ్ స్కీం కూడా లాభం లేకుండా పోయింది. ఇందులో భాగంగా డిస్కంల మొత్తం అప్పుల్లో 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలి. ఈ లెక్కన రూ.8,909 కోట్లు చెల్లించాల్సిన ప్రభుత్వం.. ఇప్పటికీ రూ.1,207 కోట్లు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టింది.