సూపర్ స్టార్ రజినీకాంత్ రాజకీయాల్లోకి రావట్లేదని చేసిన ప్రకటన తమిళ రాజకీయాలను షేక్ చేస్తోంది. డిసెంబర్ 31న ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నట్టు.. పార్టీ పేరు గుర్తు అనౌన్స్ చేయబోతున్నట్టు ఇంతకుముందు ప్రకటించారు. అయితే సడెన్ గా హైదరాబాద్ షూటింగ్ కు వచ్చిన రజినీకాంత్ అనారోగ్యం బారినపడడం.. కోలుకోవడం జరిగాక రాజకీయాల్లోకి రావాలనుకుంటున్న తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. దీంతో లక్షలాది మంది అభిమానులు తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. రాజకీయ వర్గాల్లో సైతం రజినీకాంత్ నిర్ణయం సంచలనం రేపింది. నాలుగు రోజుల్లో పార్టీని ప్రకటించాల్సి ఉండగా.. ఉన్నట్టుండి రజినీకాంత్ అస్వస్థతకు గురయ్యారు సూపర్ స్టార్ రజినీ. ఈ పరిణామంతో కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నారు రజినీకాంత్.
రజినీకాంత్ నిర్ణయం పట్ల ఆయన అభిమానులే కాదు.. రజినీకి అత్యంత సన్నిహితుడు నటుడు మక్కల్ నీది మయ్యం అధ్యక్షుడు కమల్ హాసన్ స్పందించారు. రజినీకాంత్ నిర్ణయం తనను కూడా నిరుత్సాహపరిచిందని.. కానీ అన్నింటికంటే రజినీ ఆరోగ్యమే తనకు ముఖ్యమని కమల్ హాసన్ అన్నారు. ప్రస్తుతం రాజకీయ ప్రచారంలో ఉన్న ఆయన అది పూర్తవగానే రజినీకాంత్ ను కలుస్తానని చెప్పారు.
పోతే కమల్ హాసన్ వచ్చే తమిళనాడు ఎన్నికల్లో వీలైతే రజినీతో పొత్తు పెట్టుకొని పోటీచేయాలని భావించారు. కానీ ఇప్పుడు రజినీ నిర్ణయంతో కమల్ నిరాశ చెందారు.