Templates by BIGtheme NET
Home >> Telugu News >> President poll 2022: ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్య! -నఖ్వీకి ఆర్ఎస్ఎస్ నో? -రేసులో తమిళిసై

President poll 2022: ఉపరాష్ట్రపతిగా మళ్లీ వెంకయ్య! -నఖ్వీకి ఆర్ఎస్ఎస్ నో? -రేసులో తమిళిసై


దేశ ప్రధమ పౌరుడైన రాష్ట్రపతి, రెండో పౌరుడైన ఉపరాష్ట్రపతి ఎన్నికలకు (Presidential election 2022)సంబంధించి అనూహ్య కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. దళితుడైన రాంనాథ్ కోవింద్ పదవీకాలం ముగియనుండటంతో కొత్త రాష్ట్రపతి అభ్యర్థిగా ఆదివాసి మహిళ ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించింది. రాబోయే ఎన్నికల్లో లబ్ది పొందేలా సామాజిక న్యాయం పేరుతో ఈసారి ముస్లిం వర్గానికి చెందిన నేతను ఉపరాష్ట్రపతిగా ఎంచుకుంటారని ప్రచారం జరిగింది.

కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పై ఆపరేషన్ కమల్ పారకపోవడంతో సొంత పార్టీలోనే పాపులర్ మైనార్టీ ముఖమైన ముక్తార్ అబ్బాస్ నఖ్వీ (Mukhtar Abbas Naqvi)పేరును బీజేపీ ప్రచారంలోకి తెచ్చింది. రాజ్యసభ కొనసాగింపు లేకపోవడంతో ఇప్పటికే ఆయన కేంద్ర మంత్రి పదవికి సైతం రాజీనామా చేశారు. కానీ..

ఉపరాష్ట్రపతిగా కేంద్ర మాజీ మంత్రి ముక్తార్‌ అబ్బాస్‌ నక్వీకి అవకాశమిచ్చే విషయంపై బీజేపీ నాయకత్వం లోతుగా ఆలోచిస్తున్నప్పటికీ పార్టీలోనూ, బీజేపీ మాతృసంస్థ సంఘ్ పరివార్ కు గుండెలాంటి రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆర్ఎస్ఎష్)లో కొన్ని అభ్యంతరాలు వ్యక్తమైనట్లు తెలుస్తోంది. దీంతో మరి కొన్ని పేర్లపైనా బీజేపీలో చర్చ జరుగుతోంది.

దక్షిణాదిలో విస్తరించాలని బీజేపీ గట్టిగా కాంక్షిస్తున్న నేపథ్యంలో ఉపరాష్ట్రపతి పదవిని మరోసారి ఆ ప్రాంత వాసులకు ఎందుకివ్వకూడదన్న చర్చ అంతర్గతంగా జరిగినట్లు సమాచారం. ఒకవేళ ఇదే జరిగితే ఉపరాష్ట్రపతిగా వెంకయ్యనాయుడినే కొనసాగిద్దామా.. లేక తమిళనాడుకు చెందిన తెలంగాణ గవర్నర్‌ తమిళిసైకి అవకాశమిద్దామా అని యోచిస్తున్నట్లు తెలిసింది.

వెంకయ్య పదవీకాలం ఆగస్టు 10న ముగియనుంది. ఒకట్రెండు రోజుల్లో బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశమై అభ్యర్థిని నిర్ణయించనున్నట్లు సమాచారం. బోర్డులో ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్‌షా, రాజ్‌నాథ్‌సింగ్‌, నితిన్‌ గడ్కరీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) బీఎల్‌ సంతోష్‌ సభ్యులుగా ఉన్నారు.

మరోవైపు, ఇటీవలికాలంలో అనేక ఇతర పేర్లు కూడా ప్రచారంలోకి వచ్చాయి. వారిలో పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌, కేరళ గవర్నర్‌ అరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌, కేంద్ర మాజీ మంత్రులు సురేశ్‌ ప్రభు, ఎస్‌ఎస్‌ ఆహ్లూవాలియా, కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీ్‌పసింగ్‌ పురీ, గుజరాత్‌ మాజీ ముఖ్యమంత్రి ఆనందీబెన్‌ పటేల్‌ తదితరులు ఉన్నారు. ఇక..

ఈనెల 18న రాష్ట్రపతి పదవికి ఎన్నిక జరుగనుండగా, ఆ ప్రక్రియ ముగిసిన వెంటనే ఉపరాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ ఊపందుకుంటుంది. ఈ నెల 19న ఉపరాష్ట్రపతి పదవికి నామినేషన్లు స్వీకరించడానికి చివరి తేదీ. ఏకగ్రీవం కుదరకపోతే ఆగస్టు 6న పోలింగ్‌ జరుగుతుంది. పార్లమెంటు సభ్యులే ఓటర్లు కావడం.. ఉభయసభల్లో ఎన్‌డీఏకే మెజారిటీ ఉండడంతో పాలక కూటమి అభ్యర్థి విజయం ఖాయంగా కనిపిస్తోంది. పార్లమెంటు ప్రస్తుత బలం 780 కాగా.. మెజారిటీ మార్కుకు 390 అవసరం. ఒక్క బీజేపీకే 394 మంది ఎంపీలు ఉన్నారు.