Templates by BIGtheme NET
Home >> Telugu News >> భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నా: వంశీ

భువనేశ్వరికి క్షమాపణ చెబుతున్నా: వంశీ


చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరికి వల్లభనేని వంశీ క్షమాపణ చెప్పారు. గతంలో భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రచారం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నట్లు వంశీ ప్రకటించారు. తాను అలా మాట్లాడి ఉండకూడదని, పొరపాటున ఓ మాట దొర్లానని తెలిపారు. అలా మాట్లాడటం తప్పేనని, భువనేశ్వరికి క్షమాపణ చెప్పడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని తెలిపారు.

తనకు అందరికన్నా ఎక్కువ పరిచయం భువనేశ్వరితో ఉందని పేర్కొన్నారు. బుధవారం ఓ చానల్‌లో జరిగిన డిబేట్‌లో వంశీ మాట్లాడుతూ ఆమెను అక్కా అని పిలిచేవాడిని.. ఆమెతోపాటు తన మాటల వల్ల బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నానని వంశీ ప్రకటించారు. కొన్ని రోజుల క్రితం భువనేశ్వరిని ఉద్దేశించి వంశీ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపాయి.

ఎట్టకేలకు వంశీ పశ్చాత్తాపం ప్రకటించారు. ‘తప్పు జరిగింది. ఒకటి మాట్లాడబోయి మరొకటి మాట్లాడాను. నేను చదువుకున్నాను.. అలా మాట్లాడి ఉండకూడదు. జరిగినదానికి విచారం వ్యక్తం చేస్తున్నా’ అని వంశీ తెలిపారు. కులం నుంచి వెలివేస్తారన్న భయంతో తాను క్షమాపణ చెప్పడం లేదని, నిజంగా ఫీల్‌ అయ్యాను కాబట్టే తప్పు జరిగిందని చెబుతున్నానని వంశీ వివరించారు. సమాజంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎవరికీ మంచి కాదన్నారు.

తాను ఆత్మసాక్షిగా.. వ్యక్తిగతంగా బాధపడే భువనేశ్వరికి ఆమెతోపాటు బాధపడిన వారందరికీ క్షమాపణ చెబుతున్నానని వంశీ తెలిపారు. ఇటీవల అసెంబ్లీలో భువనేశ్వరిపై వైసీపీ ఎమ్మెల్యేలు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు భువనేశ్వరిపై వ్యాఖ్యలు చేయడం.. వాటిపై చంద్రబాబు తీవ్రంగా కలతచెందారు. మీడియా సమావేశంలో కంటతడి పెట్టుకున్నారు.