Templates by BIGtheme NET
Home >> Cinema News >> ధోనీ సెకండ్ ఇన్నింగ్స్…!

ధోనీ సెకండ్ ఇన్నింగ్స్…!


భారత క్రికెట్ కు కొన్నేళ్లుగా సేవలు అందించిన స్టార్ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోనీ ఇటీవల అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. ఇండియన్ క్రికెట్ హిస్టరీలో అన్ని ఇంటర్నేషనల్ ఫార్మాట్స్ లో కప్ లు గెలిచిన కెప్టెన్ గా గుర్తింపు తెచ్చుకున్న ధోని.. అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించి ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఆడుతున్న మహేంద్ర సింగ్.. త్వరలోనే సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించేందుకు ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నాడు. ఇప్పటికే ‘ధోని ఎంటర్టైన్మెంట్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసిన ధోని.. త్వరలో ఎంటర్టైన్మెంట్ రంగంలో కొత్త ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తున్నాడు.

ధోని ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో గతేడాది ‘రోర్ ఆఫ్ ది లయన్’ అనే డాక్యుమెంటరీ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ధోని ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణంలో మరిన్ని వెబ్ సిరీస్ లు నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది నుంచి కొత్త ప్రాజెక్టులను నిర్మించటానికి ప్లాన్ చేసుకున్న ప్రొడక్షన్ హౌస్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ధోని భార్య సాక్షి సింగ్ వీటి గురించి సమాచారం అందించారు. ”వినోద రంగంలోకి ప్రవేశించడానికి ఇది సరైన సమయమని భావిస్తున్నాం.. ప్రతిభావంతులను మా బ్యానర్ ద్వారా ఎంకరేజ్ చేస్తాం. మంచి కథలను రూపొందించడమే మా లక్ష్యం. ఇప్పటికే ఓ ప్రముఖ పుస్తకం రైట్స్ తీసుకున్నాం. దానిని వెబ్ సిరీస్ గా తీసుకురాబోతున్నాం. ఇది ఒక సైన్స్ ఫిక్షన్ కథ” అని సాక్షి ప్రకటించారు. ఈ సిరీస్ లో నటించే నటీనటులు సాంకేతిక నిపుణులను త్వరలోనే ఖరారు చేయనున్నారు.