Templates by BIGtheme NET
Home >> Cinema News >> ఆ క్రేజీ మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయినట్లేనా…?

ఆ క్రేజీ మూవీ ఓటీటీ రిలీజ్ కి రెడీ అయినట్లేనా…?


కరోనా కారణంగా విడుదలకు నోచుకోని సినిమాలలో అనుష్క – మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘నిశబ్దం’ కూడా ఒకటి. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. తమిళ తెలుగు భాషల్లో రూపొందిన ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల.. కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. పూర్తిగా విదేశాలలో షూటింగ్ జరుపుకున్న ‘నిశబ్దం’ మూవీ అనేక వాయిదాల అనంతరం ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేస్తున్నామని మేకర్స్ ప్రకటించారు. అయితే కరోనా పరిస్థితుల వల్ల రిలీజ్ చేయడం కుదరలేదు. పరిస్థితులు చూస్తుంటే ఇప్పట్లో థియేటర్స్ రీ ఓపెన్ చేయడం కష్టమే అని భావించి ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకున్న సినిమాలను డైరెక్ట్ ఓటీటీలలో రిలీజ్ చేస్తున్నారు. అయితే ‘నిశ్శబ్దం’ మేకర్స్ మాత్రం సినిమా థియేటర్లు తెరుచుకునే రోజు కోసం ఎదురు చూడాలని.. ఓటీటీలు మంచి ఆఫర్లు ఇచ్చినప్పటికీ తిరస్కరిస్తూ వచ్చారు.

అయితే తాజాగా నిర్మాతల్లో ఒకరైన కోన వెంకట్ ట్విట్టర్ లో ఓ పోల్ పెట్టారు. ”మీరు థియేటర్ల కోసం జనవరి లేదా ఫిబ్రవరి వరకు వేచి ఉండాల్సి వస్తే… ‘నిశ్శబ్దం’ చిత్రాన్ని ఏ వేదికపై చూడాలనుకుంటున్నారు” అని ప్రశ్నించారు. దీనిని బట్టి చూస్తే మేకర్స్ ఓటీటీ విడుదలకు సిద్ధపడుతున్నట్టు అర్థం అయింది. దీనికి తగ్గట్టే ట్విట్టర్ పోల్ లో 56.5 % ఓటీటీలో రిలీజ్ చేయమని.. 28.7 % థియేటర్స్ లో రిలీజ్ చేయమని.. మిగతా వారు ఎక్కడైనా పర్వాలేదని చెప్పారు. ఇప్పటికే ఓ ప్రముఖ ఓటీటీతో డిస్కషన్ చేస్తున్న మేకర్స్ సూచనప్రాయంగా అంగీకరించినట్లు తెలుస్తోంది. హీరోయిన్ అనుష్క కూడా ముందు ఓటీటీ రిలీజ్ ని వ్యతిరేకించినప్పటికీ ప్రొడ్యూసర్స్ పరిస్థితిని కూడా అర్థం చేసుకొని డిజిటల్ రిలీజ్ కి ఒప్పుకుందట. ఈ నేపథ్యంలో త్వరలోనే ‘నిశ్శబ్దం’ సినిమా డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ లో రిలీజ్ అయ్యే అవకాశం ఉందని ఓటీటీ వర్గాల సమాచారం.