Templates by BIGtheme NET
Home >> Cinema News >> చైనా బ్రాండ్ ని ప్రమోట్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురైన హీరోయిన్స్…!

చైనా బ్రాండ్ ని ప్రమోట్ చేసి నెటిజన్స్ ఆగ్రహానికి గురైన హీరోయిన్స్…!


సినీ స్టార్స్ చాలామంది సినిమాలతోనే కాకుండా బ్రాండ్ ప్రమోషన్స్ తో కూడా సంపాదిస్తారనే విషయం తెలిసిందే. తమకున్న క్రేజ్ ని వాడుకొని అంతో ఇంతో వెనకేసుకోవాలని చూస్తుంటారు. ఈ నేపథ్యంలో షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్ తో పాటు కొన్ని ప్రైవేట్ ఈవెంట్స్ కి అటెండ్ అవుతుంటారు. అయితే ఇప్పుడు కరోనా కారణంగా ఏర్పడిన పరిస్థితుల్లో కేవలం సోషల్ మీడియాలో ప్రచారం చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. లాక్ డౌన్ లో చాలామంది సెలబ్రిటీలు సోషల్ మీడియా ద్వారా పెయిడ్ ప్రమోషన్స్ చేస్తూ బాగానే సంపాదిస్తున్నారని తెలుస్తోంది.

ఈ క్రమంలో కొంతమంది హీరోయిన్స్ ‘రియల్ మీ’ అనే చైనా మొబైల్ బ్రాండ్ ని కూడా ప్రమోట్ చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ లేటెస్టుగా ఇంస్టాగ్రామ్ లో ‘రియల్ మీ’ మొబైల్ పట్టుకొని ఉన్న ఫోటో పోస్ట్ చేస్తూ ”మీరు ఎప్పుడైనా 3 నిమిషాల ఫాస్ట్ ఛార్జింగ్ ను ట్రై చేసారా? నేను realme7Pro తో ప్రయత్నించాను. ఇది నాకు 3 నిమిషాల్లో 13% ఛార్జింగ్ ఇచ్చింది. ఇది 3 గంటలు మాట్లాడుకోవడానికి సరిపోతుంది” అని పేర్కొంది. కాజల్ తో పాటు నిధి అగర్వాల్ – సోనమ్ బజ్వా – ఊర్వశి రౌటేలా – ఇషా గుప్తా లాంటి హీరోయిన్స్ కూడా ఈ చైనా బ్రాండ్ మొబైల్ ని ప్రమోట్ చేస్తూ పోస్టులు పెట్టారు.

అయితే దీనిపై వారి అభిమానుల నుంచి నెగెటివ్ కామెంట్స్ వస్తున్నాయి. ఒక పక్క కయ్యానికి కాలు దువ్వుతున్న పొరుగు దేశం చైనా కు సంబంధించిన యాప్స్ ని మన దేశంలో బ్యాన్ చేస్తూ వస్తుంటే.. మీరు ఇలా చైనా ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయడం కరెక్ట్ కాదని కామెంట్స్ చేస్తున్నారు. చైనా తో యుద్ధం చేస్తూ మన సైనికులు ప్రాణాలు అర్పిస్తున్నారు.. అలాంటిది డబ్బుల కోసం చైనా బ్రాండ్స్ ని ప్రమోట్ చేస్తున్నారు అంటూ విమర్శిస్తున్నారు. ఇండియన్స్ అందరూ చైనా ప్రొడక్ట్స్ ని బహిష్కరిస్తూ నిరసన తెలుపుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా చైనా బ్రాండ్స్ కి ప్రచారం చేయడం ఆపాలని వారిని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు. మరికొందరు మాత్రం ఆ చైనా మొబైల్స్ ని ఇండియాలో అమ్ముతున్నప్పుడు ప్రమోట్ చేస్తే తప్పేంటి అంటూ వారిని వెనకేసుకొని వస్తున్నారు.