Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘దైవం మానుష్య రూపేణ’ అంటున్న యంగ్ హీరో..!

‘దైవం మానుష్య రూపేణ’ అంటున్న యంగ్ హీరో..!


‘అర్జున్ సురవరం’ సినిమా సక్సెస్ తో జోష్ లో ఉన్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో ’18 పేజెస్’ సినిమా షూటింగ్ పూర్తి చేసిన నిఖిల్.. చందు మొండేటి డైరెక్షన్ లో ‘కార్తికేయ 2’ వర్కింగ్ టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. మాలీవుడ్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. చందు మొండేటి – నిఖిల్ కాంబోలో వచ్చిన సూపర్ హిట్ ‘కార్తికేయ’ చిత్రానికి సీక్వెల్ గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రానికి ”దైవం మానుష్య రూపేణ” అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కొన్ని వేల సంవత్సరాల క్రితం నాటి రహస్యం ఆధారంగా థ్రిల్లింగ్ మిస్టరీ కాన్సెప్ట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని సమాచారం. నిఖిల్ కెరీర్ లోనే అత్యధిక బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రంలో ‘కార్తికేయ’ కు మించి వీఎఫ్ఎక్స్ వర్క్స్ ఉంటాయని.. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటి నెక్స్ట్ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమా కోసం నిఖిల్ కూడా బాగా కష్టపడుతున్నాడు. భారీ వర్కవుట్స్ చేసి బాడీ ని బిల్డ్ చేసి పర్ఫెక్ట్ ఫిజిక్ ని మెయింటైన్ చేస్తున్నాడు. పాండమిక్ లో దీని కోసం సమయం దొరకడంతో కంప్లీట్ గా తన లుక్ పైనే దృష్టి పెట్టారు యువ హీరో.

కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల్లో నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ఇటీవలే తిరిగి ప్రారంభమైంది. ఇప్పటికే గుజరాత్ – ఉత్తరాఖండ్ – హిమాచల్ ప్రదేశ్ – పంజాబ్ – రాజస్థాన్ లలోని కొన్ని ప్రాంతాల్లో 25 రోజులు షూటింగ్ జరిపారు. ‘దైవం మానుష్య రూపేణ’ రాబోయే షెడ్యూల్ లో కొన్ని కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ కోసం యూరప్ లోని గ్రీస్ మరియు ఆగ్నేయాసియా దేశమైన వియత్నాం లకు చిత్ర బృందం పయనం కానుంది. ఈ నేపథ్యంలో ఫారిన్ షెడ్యుల్ కోసం ఇప్పటికే నటీనటులు మరియు సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ వేసినట్లు తెలుస్తోంది.

‘కార్తికేయ 2’ సినిమాతో మరో సక్సెస్ అందుకుంటామని హీరో నిఖిల్ – డైరెక్టర్ చందు కాన్ఫిడెంట్ గా ఉన్నారని తెలుస్తోంది. ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. కాలభైరవ సంగీతం సమకూరుస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ – అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టీజీ విశ్వప్రసాద్ – అభిషేక్ అగర్వాల్ – వివేక్ కూచిభోట్ల కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ఇకపోతే ’18 పేజెస్’ ‘దైవం మానుష్య రూపేణ’ సినిమాలతో పాటుగా మరో మూడు ప్రాజెక్ట్స్ కు నిఖిల్ సిద్దార్థ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో యంగ్ హీరో ఓ మూవీ కమిట్ అయ్యారు. బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అలానే ఏషియన్ గ్రూప్ సంస్థకు చెందిన శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ బ్యానర్ లో నిఖిల్ ఓ సినిమా చేయనున్నారు. ఇది యువ హీరో కెరీర్ లో మైలురాయి 20వ చిత్రంగా హయ్యెస్ట్ బడ్జెట్ తో రూపొందనుంది. సునీల్ నారంగ్ సమర్పణలో నారాయణదాస్ కె నారంగ్ మరియు పుష్కర్ రామ్ ఎమ్ రావ్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ క్రమంలో కొత్త దర్శకుడితో ఓ స్పై థ్రిల్లర్ సినిమా చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు నిఖిల్. ఏదేమైనా నిఖిల్ విభిన్నమైన స్క్రిప్ట్ లను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి కృషి చేస్తున్నారని చెప్పవచ్చు.