రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం పై గత పాతికేళ్లుగా చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఆయన రాజకీయాల్లోకి వస్తారా లేదా అనే విషయమై 1996వ ఏడాది నుంచి చర్చ జరుగుతుండగా.. మూడేళ్ల క్రితం రజనీ ఆ ఉత్కంఠకు తెరదించారు. అయితే రాజకీయాల్లోకి వస్తున్నట్టు ప్రకటించినా కూడా క్రియాశీలక రాజకీయాలకు కూడా దూరంగానే ఉన్నారు. దీంతో ఆయన రాజకీయ అరంగేట్రం రాష్ట్ర రాజకీయాల్లో చర్చలకే పరిమితమైంది. దీనితో తమిళ ప్రజలు అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూపర్ స్టార్ రాజకీయ అరంగేట్రం ఖరారైంది.
వచ్చే ఏడాది ఆయన రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా రజినీకాంత్ కీలక ప్రకటన చేశారు. జనవరీలో రాజకీయ పార్టీని ప్రారంభిస్తానని అందుకు సంబంధించిన వివరాలను డిసెంబరు 31న ప్రకటిస్తానని వెల్లడించారు. ఇకపోతే ఈ వారం మొదట్లోనే తన అభిమాన సంఘాల నాయకులతో చెన్నైలోని రాఘవేంద్ర కళ్యాణమండపంలో రజినీ సమావేశమయ్యారు. రజనీ మక్కళ్ మండ్రం నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. అయితే ఆ భేటీ తర్వాత రజినీ రాజకీయ అరంగేట్రం పై కీలక ప్రకటన చేస్తారు అనుకున్నా కూడా ఆ రోజు మాట్లాడలేదు. తాజాగా ట్విట్టర్ వేదికగా ఓ స్పష్టతనిచ్చారు. దీనితో తలైవా అభిమానులు ఆనందంలో మునిగిపోయారు.