Templates by BIGtheme NET
Home >> Telugu News >> బీజేపీ-శివసేన కలవబోతున్నాయా?

బీజేపీ-శివసేన కలవబోతున్నాయా?


మిత్రులుగా పోటీచేసి.. ఎన్నికల అనంతరం విడిపోయి శత్రువులుగా మారిపోయారు బీజేపీ శివసేనలు.. ఎన్నికల్లో సీట్లు తగ్గిన బీజేపీని దూరం పెట్టిన శివసేన.. తనకు ప్రత్యర్థులైనా సరే కాంగ్రెస్ ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. కానీ ఆ సంకుల సమరం ఫెయిల్ అవుతోందా? మళ్లీ శివసేన.. బీజేపీ వైపు చూస్తోందా? అంటే ఔననే అంటున్నాయి మహారాష్ట్ర రాజకీయ వర్గాలు..

ఈ పరిణామాల నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయం ఒక్కసారి మారిపోయింది. కాంగ్రెస్ ఎన్సీపీలతో దోస్త్ కట్ చేసి మళ్లీ బీజేపీతో శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి చూస్తుందా అంటే పరిణామాలు ఔననే అంటున్నాయి. ఇటీవల శివసేన బీజేపీ కీలక నేతల భేటితో రాజకీయ వర్గాల్లో ప్రచారం మొదలైంది. తమ కలయికపై ఇరు పార్టీలు గుంభనంగా ఉన్నాయి.

మిత్రుడు శివసేన హ్యాండ్ ఇవ్వడంతో మహారాష్ట్రలో అధికారం కోల్పోయిన బీజేపీకి మళ్లీ పాత మిత్రుడు శివసేన దగ్గర కావడం విశేషంగా మారింది. శివసేన అధికారం కోసం హిందుత్వ ఎజెండాను పక్కనపెట్టి సెక్యులర్ కాంగ్రెస్ ఎన్సీపీలతో జట్టుకట్టి మహారాష్ట్రలో గద్దెనెక్కిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా బీజేపీకి మళ్లీ దగ్గరయ్యే ప్రయత్నాలను శివసేన చేస్తోంది. శివసేన ముఖ్యనేత ఎంపీ సంజయ్ రౌత్ మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తో రహస్యంగా భేటి అవ్వడం చర్చనీయాంశమైంది.. ముంబైలోని ఓ హోటల్ లో ఫడ్నవీస్ తో సుమారు గంటన్నరపాటు చర్చ జరిపినట్టు సమాచారం.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత బీజేపీ శివసేన విడిపోయాయి. బీజేపీ ప్రతిపక్షంలోకి పోగా.. కాంగ్రెస్ తో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈ క్రమంలోనే మళ్లీ పాత మిత్రులు ఇలా కలవడం రాజకీయవర్గాల్లో చర్చకు దారితీసింది.

అయితే ఈ భేటిపై వెనుక ఎటువంటి రాజకీయ కారణలేవని శివసేన తెలిపింది. శివసేన అధికార పత్రిక సామ్నాలో పత్రిక కథనం కోసం సంజయ్ రౌత్ ఫడ్నవీస్ ను ఇంటర్వ్యూ చేయాలని భావించారని.. అందుకే ఆయనతో సమావేశమయ్యారని పేర్కొన్నారు.