Templates by BIGtheme NET
Home >> Cinema News >> అమ్మడికి దక్షిణాది నుంచి సరైన అవకాశాలు రావడం లేదా..?

అమ్మడికి దక్షిణాది నుంచి సరైన అవకాశాలు రావడం లేదా..?


‘అతిలోక సుందరి’ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ ‘దఢక్’ సినిమాతో తెరంగ్రేటం చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ సినిమాతో ఊహించని ఫలితాన్ని అందుకున్న జాన్వీ ఆ తర్వాత ‘ఘోస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధంలో పాల్గొన్న మొట్ట మొదటి లేడీ పైలెట్ గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా ‘గుంజన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ చిత్రంలో జాన్వీ టైటిల్ రోల్ ప్లే చేసింది. లాక్ డౌన్ లో డైరెక్ట్ ఓటీటీ పద్ధతిలో విడుదలైన ఈ సినిమా జాన్వీకి మంచి పేరు తెచ్చిపెట్టింది. అలానే రాజ్ కుమార్ రావ్ తో కలిసి నటించిన ‘రూహి అఫ్జనా’ మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఇకపోతే జాన్వీ కపూర్ తెలుగు చిత్రాల్లో నటించాలనే కోరికను ఇప్పటికే వెలిబుచ్చింది. టాలీవుడ్ మేకర్స్ ఆమెను ఇంట్రడ్యూస్ చేయడానికి ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కాలేదు.

వాస్తవానికి పూరీ జగన్నాథ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఫైటర్’ సినిమాలో ముందుగా జాన్వీ కపూర్ ని హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారు. అయితే పెయిరింగ్ మ్యాచ్ అవ్వకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నుంచి జాన్వీ బయటకొచ్చి అనన్య పాండే వచ్చి చేరిందని టాక్ నడిచింది. ఇక లేటెస్ట్ గా అక్కినేని అఖిల్ – సురేందర్ రెడ్డి కాంబోలో రాబోతున్న సినిమాలో జాన్వీ ని నటింపజేయాలని అనుకున్నారట. కానీ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ లోకి రష్మిక మందన్న వచ్చి చేరిందని తెలుస్తోంది. అన్నీ సరిగ్గా కుదిరితే రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీతో జాన్వీ తెలుగులో ఎంట్రీ ఇవొచ్చని టాక్ నడుస్తోంది. అలానే స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ సీక్వెల్ చేస్తే జాన్వీ కపూర్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. అయితే సౌత్ నుంచి సరైన అవకాశాలు రాకపోవడం వల్లనే ఈ బ్యూటీ ఇక్కడ డైరెక్ట్ సినిమా చేయడం లేదని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. మరి రాబోయే రోజుల్లో జాన్వీ డైరెక్ట్ తెలుగు సినిమాతో అలరిస్తుందేమో చూడాలి.