మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్. థమన్ ఈ ఏడాది ప్రారంభంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాకి అద్భుతమైన సంగీతం అందించాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ – పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా అంతటి విజయం సాధించడంలో థమన్ సంగీతం మరియు నేపథ్య సంగీతం మేజర్ రోల్ ప్లే చేసాయని చెప్పవచ్చు. ‘అల..’ ఆల్బమ్ వచ్చి తొమ్మిది నెలలు అవుతున్నా పాటలు మాత్రం అలా మోగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ‘సామజవరగమనా..’ ‘రాములో రాములా..’ ‘బుట్టబొమ్మ..’ వంటి సాంగ్స్ యూట్యూబ్ లో రికార్డు స్థాయిలో వ్యూస్ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో సంగీత ప్రియుల కోసం ‘అల వైకుంఠపురములో’ ఆల్బమ్ ఒరిజినల్ సౌండ్ ట్రాక్(ఓ ఎస్ టి) త్వరలోనే రిలీజ్ చేయబోతున్నట్లు థమన్ ప్రకటించాడు.
కాగా ఇప్పటికే ‘అల వైకుంఠపురములో’ బీజీఎమ్ ని రెడీ చేస్తున్నానని చెప్పిన థమన్.. ఇప్పుడు ఒరిజినల్ సౌండ్ ట్రాక్ ని విడుదల చేస్తున్నట్లు చెప్పాడు. ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఈ ఆల్బమ్ కి కొన్ని అడిషనల్ సౌండ్ ట్రాక్స్ కూడా జత చేస్తున్నట్లు తెలిపాడు. ఓఎస్టీ పనులు జరుపుకుంటున్న వీడియో షేర్ చేసిన థమన్ ఈ సౌండ్ ట్రాక్స్ త్వరలోనే రిలీజ్ చేయనున్నట్టుగా తెలిపాడు. ఇదిలా ఉండగా థమన్ ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’.. సాయి ధరమ్ తేజ్ ‘సోలో బ్రతుకే సో బెటర్’.. రవితేజ ‘క్రాక్’.. కీర్తి సురేష్ ‘మిస్ ఇండియా’ వంటి తెలుగు చిత్రాలకి మ్యూజిక్ అందిస్తున్నాడు. వీటితో పాటు బాలయ్య – బోయపాటి శ్రీను కాంబోలో వస్తున్న సినిమా.. నాని ‘టక్ జగదేశ్’.. వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా.. మహేష్ బాబు ‘సర్కారు వారి పాట’ సినిమాలు లైన్లో ఉన్నాయి.
We are adding Some additional tracks also for #avplbgm OST !!
Very Soon to ur ears