Templates by BIGtheme NET
Home >> Telugu News >> Sriharikota: షార్‌కు చేరిన విదేశీ ఉపగ్రహాలు

Sriharikota: షార్‌కు చేరిన విదేశీ ఉపగ్రహాలు


తిరుపతి జిల్లా శ్రీహరికోట (Sriharikota)లోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రం సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌(షార్‌)లో త్వరలో జరగబోయే ప్రయోగాలకు సంబంధించిన విదేశీ ఉపగ్రహాలు శనివారం షార్‌కు చేరాయి. మార్చిలో ప్రయోగించే జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3 (ఎల్‌వీఎం-3) రాకెట్‌ ద్వారా వన్‌వెబ్‌ కంపెనీకి చెందిన 36 ఉపగ్రహాలను కక్ష్యలోకి పంపనున్నారు. వీటిలో 33 విదేశీ ఉపగ్రహాలు శనివారం తెల్లవారు జామున భారీ భద్రత నడుమ చెన్నై (Chennai) నుంచి రోడ్డు మార్గాన షార్‌కు చేరాయి. జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌ 3 రాకెట్‌ ప్రయోగాన్ని మార్చి రెండోవారంలో చేపట్టేందుకు ఇస్రో శాస్త్రవేత్తలు సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే షార్‌లోని రెండో ప్రయోగ వేదికపై రాకెట్‌ రెండు దశల పనులను శాస్త్రవేత్తలు పూర్తి చేశారు. ఉపగ్రహాలను క్లీన్‌ రూమ్‌లో పెట్టి తుది పరీక్షలు నిర్వహించిన అనంతరం రాకెట్‌ చివరి దశలో అమర్చనున్నారు.

ఈ ప్రయోగానికి ముందు ఫిబ్రవరి మూడో వారంలో ఎస్‌ఎస్‌ఎల్‌వీ-డీ 2 (స్మాల్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) ప్రయోగం చేపట్టనున్నారు. ఇప్పటికే ఈ ప్రయోగానికి సంబంధించిన పనులను శాస్త్రవేత్తలు పూర్తిచేశారు. రాకెట్‌ మోటారుకు వివిధ రకాల పరీక్షలు విజయవంతంగా నిర్వహించి ప్రయోగానికి సిద్ధం చేశారు. గత ఏడాది ఆగస్టులో తొలిసారిగా ప్రయోగించిన ఎస్‌ఎస్‌ఎల్‌వీ (SSLV) ప్రయోగంలో నింగిలోకి ఎగిరిన అనంతరం ఉపగ్రహం నుంచి సంకేతాలు అందలేదు. ఈ లోటుపాట్లను సరిచేసిన శాస్త్రవేత్తలు రాకెట్‌ అన్ని దశల పనితీరును క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఎస్‌ఎస్‌ఎల్‌వీ ప్రయోగంతో ప్రారంభమయ్యే ప్రయోగాల పరంపర ఈ ఏడాది షార్‌లో కొనసాగనుంది.