Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ధర ప్రకటించిన సీరమ్..!?

ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ ధర ప్రకటించిన సీరమ్..!?


ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వాక్సిన్ కోసం కళ్లల్లో ఒత్తులు వేసుకొని ఎదురుచూస్తోంది. ఇప్పటికే పలు వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. ఫైజర్ ఆస్ట్రజెనికా ఆక్స్ ఫర్డ్ స్పుత్నిక్ కొవాగ్జిన్ వంటి వాక్సిన్ లు చివరి దశ ప్రయోగాల్లో ఉన్నాయి. అయితే ఇవి ప్రజలకు ఎప్పుడు వస్తాయి ధర ఎంత ఉంటుంది అని చర్చ జరుగుతున్న సమయంలో సీరం ఇన్ స్టిట్యూట్ సీఈవో ఆడర్ పూనావాలా సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్ లో 2021 ఫిబ్రవరి లోపు హెల్త్ కేర్ సిబ్బంది వృద్ధులకు ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని ప్రకటించారు.

అంతేకాదు ఈ వాక్సిన్ ధర రూ. వెయ్యిలోపే ఉంటుందని స్పష్టం చేశారు. వెయ్యి రూపాయలకే రెండు వాక్సిన్ డోస్ లు అందివ్వబోతున్నట్టు తెలిపారు. హిందుస్థాన్ టైమ్స్ లీడర్ షిప్ సమ్మిట్ లో పాల్గొన్న పూనావాలా.. 2021 ఏప్రిలో సాధారణ ప్రజలందరికీ ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ అందుబాటులోకి వస్తుందని తెలిపారు. 2024 నాటికి దేశంలోని పౌరులందరికీ వాక్సిన్ వేస్తారని తెలిపారు. బ్రిటిష్-స్వీడిష్ కంపెనీ ఆస్ట్రాజెనికా బ్రిటన్ కు చెందిన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు సంయుక్తంగా AZD1222 వాక్సిన్ను అభివృద్ధి చేశారు. వాడుక భాషలో ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ గా పిలుస్తున్నారు.

మనదేశంలో ఆ వాక్సిన్ ఉత్పత్తికి సీరం ఇన్నస్టిట్యూట్ ఒప్పందం చేసుకుంది. ఇప్పటికే ఈ వాక్సిన్ హ్యూమన్ ట్రయల్స్ తుది దశలో ఉన్నాయి. ఆక్స్ ఫర్డ్ వాక్సిన్ చౌకయినదని సురక్షితమైదని సీరమ్ ఇన్స్టిట్యూట్ సీఈవో పూనావాలా తెలిపారు. 2021 మార్చి నాటికి 20 కోట్ల టీకాలు వచ్చే అవకాశముందని వెల్లడించారు. మరోవైపు స్వదేశీ టీకా కొవాగ్జిన్ కూడా మూడో దశ ప్రయోగాలకు సిద్ధమవుతోంది. భారత్ బయోటెక్-ఐసీఎంఆర్ అభివృద్ధి చేస్తున్న ఈ వాక్సిన్పై ఇవాళ్టి నుంచే మూడో దశ క్లినికల్ ట్రయల్స్ ప్రారంభం కానున్నాయి.