Templates by BIGtheme NET
Home >> Telugu News >> స్మార్ట్ ఫోన్ తోనే కరోనా టెస్ట్ … 30 నిముషాల్లో ఫలితం !

స్మార్ట్ ఫోన్ తోనే కరోనా టెస్ట్ … 30 నిముషాల్లో ఫలితం !


కరోనా వైరస్ మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచ మొత్తం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. త్వరగా వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే వైరస్ నుంచి బయటపడతామని ప్రపంచం ఆశగా ఎదురుచూస్తోంది. అయితే ఇప్పటికీ అందుబాటులోకి రాకపోవడంతో వైరస్ నియంత్రణకు రోగుల గుర్తింపే అసలైన మార్గంగా అన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి. ఇటీవల ఆంటీజెన్ కిట్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత కరోనా నిర్థారణ పరీక్షలు వేగవంతమయ్యాయి. కరోనా నిర్థారణకు ప్రారంభంలో రోజుల వ్యవధి పట్టగా ఇప్పుడు మాత్రం కేవలం కొన్ని నిమిషాల వ్యవధిలోనే పరీక్షలు పూర్తవుతున్నాయి.

అయితే ఆంటీజెన్ కిట్లతో ప్రస్తుతం ఫలితాలు వేగంగా అందుతున్నప్పటికీ అవి ఇచ్చే ఫలితాల విషయంలో ఎన్నో సందేశాలు నెలకొన్నాయి. ప్రధానంగా ఈ టెస్టుల్లో కచ్చితత్వం ఆశించిన మేర లేకపోవడమే ఓ పెద్ద మైనస్. ఈ నేపథ్యంలో కచ్చితమైన వేగవంతమైన కరోనా టెస్టుల కోసం శాస్త్రవేత్తలు నిరంతరం శ్రమిస్తున్నారు. వారి ప్రయత్నాల ఫలితమే అమెరికా శాస్త్రవేత్తలు నూతనంగా రూపొందించిన స్మార్ట్ ఫోన్ కరోనా టెస్ట్.. కాలిఫోర్నియా యూనివర్సిటీ యుసి బర్క్లీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు శాన్ ఫ్రాన్సిస్కో పరిశోధకుల బృందం ఈ కొత్త విధానాన్ని అందుబాటులో తెచ్చాయి.

స్మార్ట్ ఫోన్ కెమెరాను ఉపయోగించి చేసే ఈ కరోనా టెస్ట్ ద్వారా కేవలం 30 నిమిషాల్లోనే ఫలితాన్ని తెలుసుకోవచ్చు. దీనిపై గ్లాడ్ స్టోన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ డైరెక్టర్ అధ్యయన రచయిత మెలానియా ఓట్ మాట్లాడుతూ… ప్రపంచాన్ని కలవరపెడుతున్న కరోనావైరస్ వ్యాప్తిని కట్టడి చేయడంలో సహాయపడటానికి మా పరిశోధనా బృందం అభివృద్ధి చేసిన ఈ స్మార్ట్ఫోన్ కరోనా టెస్ట్ తక్కువ -ధరలోనే వేగవంతమైన ఫలితాలను అందిస్తుంది..అని ఆమె అన్నారు. నిర్ధారణ ప్రక్రియలో భాగంగా క్యాస్–13 అనే ఎంజైమ్తో వైరస్ జన్యుపదార్థాన్ని కత్తిరిస్తారు. ఈ క్రమంలో వెలువడే వెలుతురును స్మార్ట్ ఫోన్ కెమెరా తో గుర్తించవచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కేవలం 30 నిమిషాల్లో పూర్తవుతుంది. తద్వారా వేగంగా ఫలితం రాబట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.