Templates by BIGtheme NET
Home >> Telugu News >> సెప్టెంబరులోనే బయటపడ్డ కొత్త కరోనా.. పలు దేశాలకు వ్యాపించొచ్చు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్

సెప్టెంబరులోనే బయటపడ్డ కొత్త కరోనా.. పలు దేశాలకు వ్యాపించొచ్చు: డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సైంటిస్ట్


బ్రిటన్‌లో కొత్తరకం కరోనా జన్యువు విజృంభించడంతో మహమ్మారికి టీకా అందుబాటులోకి వచ్చిన సంతోషం అంతలోనే అవిరవుతోంది. బ్రిటన్‌లో తొలిసారి గుర్తించిన కొత్త రకం కరోనా స్ట్రెయిన్ అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ఈ వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించినట్టు అనుమానిస్తున్నారు. తాజాగా, ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ ఈ వైరస్ గురించి మాట్లాడుతూ.. కొత్త స్ట్రెయిన్‌ను సెప్టెంబరులోనే బ్రిటన్‌లో గుర్తించారని, దీనికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణాలున్నాయని తెలిపారు. అంతేకాదు, పలు దేశాలకు ఇది వ్యాపించి ఉండొచ్చని ఆమె అభిప్రాయపడ్డారు.

ఏదిఏమైనా ఈ కొత్తరకం జన్యువు గురించి తొందరగానే ఓ అవగాహనకు రావచ్చని, ప్రస్తుత స్ట్రెయిన్ కంటే ఇది 70 శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్టు ప్రాథమిక డేటా సూచిస్తుందన్నారు. ఇప్పటికే అభివృద్ధి చేసిన కరోనా టీకాలు ఈ ఉత్పరివర్తనాలపై ప్రభావం చూపే అవకాశం ఉందని అన్నారు. ‘మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్న దేశాలలో బ్రిటన్ ఒకటి.. అందువల్ల తక్కువ సమయంలో దీన్ని చాలా దగ్గరగా ట్రాక్ చేయగలదు.. మిగతా దేశాలూ ఈ జన్యు వైవిధ్యాన్ని ఇప్పటికే కనుగొంటారని తాను భావిస్తున్నాను’ అని అన్నారు.

‘ఇటలీలోనూ ఓ వ్యక్తిలో ఈ కొత్త స్ట్రెయిన్ గుర్తించినట్టు బ్రిటన్ తెలిపింది.. కరోనా జన్యు వైవిధ్యంలో 17 ముఖ్యమైన ఉత్పరివర్తనాలను సూచిస్తుంది.. ఆస్ట్రేలియా, డెన్మార్క్, నెదర్లాండ్‌లోనూ కేసులు నమోదయ్యాయి.. దక్షిణాఫ్రికాలో ఇది దూకుడు ప్రదర్శిస్తోంది’ అని స్వామినాథన్ పేర్కొన్నారు. ‘గతంలోనూ ఇతర వైరస్‌లు ఉత్పరివర్తనం చెందాయి.. వ్యాప్తి ఎక్కువయ్యే కొద్దీ వైవిధ్యతను ప్రదర్శిస్తాయి..ఇది అలాంటి మరొక వైవిధ్యం కావచ్చు’ అని ఆమె అభిప్రాయపడ్డారు. స్పైక్ ప్రోటీన్‌లో కొన్ని ఉత్పరివర్తనాలు మారే అవకాశం లేదు కాబట్టి కొన్ని టీకాలు ప్రభావం చూపుతాయని అన్నారు.

‘ప్రస్తుతానికి, మేము ఎక్కువ జన్యు శ్రేణి విశ్లేషించాలని ప్రపంచ దేశాలను ప్రోత్సహిస్తున్నాం… మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ (సమర్థవంతమైన వ్యాక్సిన్‌ అభివృద్ధి చేయడంలో కీలకమైన వాటిలో ఒకటి) చేయగల సామర్థ్యం భారత్‌కు ఉంది.. వాస్తవానికి ప్రపంచ డేటాలోని దాదాపు 300,000 సీక్వెన్స్‌లు భారత్‌కు ఇప్పటికే చాలా దోహదపడుతుంది’ఆమె చెప్పారు.

అంతేకాదు, ఈ స్ట్రెయిన్ వ్యాప్తి చెందకుండా అన్ని దేశాలూ చర్యలు తీసుకోవాలని, మహమ్మారిని అరికట్టాలని డాక్టర్ సౌమ్యా స్వామినాథన్ సూచించారు. ఎప్పటి మాదిరిగానే టెస్టింగ్, కాంటాక్ట్ ట్రేసింగ్, పాజిటివ్ వచ్చిన వ్యక్తులను క్వారంటైన్‌లో ఉంచాలని తెలిపారు. ఈ సెప్టెంబరులో కొత్తరకం కరోనా స్ట్రెయిన్‌ను ఆగ్నేయ ఇంగ్లాండ్‌లో తొలిసారిగా గుర్తించారు. ఇది అత్యంత వేగంగా లండన్ సహా ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. ప్రస్తుతం బ్రిటన్‌లో రోజుకు 36వేలకుపైగా కొత్త కేసులు నమోదవుతున్నాయి.