మకర సంక్రాంతి సందర్భంగా శబరిమల క్షేత్రం ‘స్వామియే శరణం అయ్యప్ప’ అంటున్న స్వాముల నామ స్మరణతో మార్మోగిపోయింది. జ్యోతి దర్శనం కోసం భక్తులు సుదీర్ఘంగా నిరీక్షించారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈశాన్య దిశలోని పొన్నాంబలంమేడు పర్వతశ్రేణుల్లో వెలుగులు జిమ్ముతూ జ్యోతి దర్శనమిచ్చింది. దీంతో అయ్యప్ప దీక్షలో ఉన్న స్వాములు పులకించిపోయారు.
జ్యోతిని చూస్తూ ‘స్వామియే శరణం అయ్యప్ప’ శరణుఘోషతో శబరిగిరులు మోగిపోయాయి. కాంతమాల కొండలపై దేవతలు, రుషులు కలిసి అయ్యప్పకు హారతి ఇస్తారని భక్తుల విశ్వాసం. ఈ జ్యోతి దర్శనం కోసం అయ్యప్ప భక్తులు ఎంతగానో ఎదురుచూస్తారు. జ్యోతికి ముందు పందాళం నుంచి తీసుకొచ్చిన తిరువాభరణాలను ప్రధాన అర్చకులు స్వామి వారికి అలంకరించి హారతి ఇచ్చారు.