Templates by BIGtheme NET
Home >> Cinema News >> చిత్రపురిలో 11 మంది 300 కోట్లు దోచేశారు!

చిత్రపురిలో 11 మంది 300 కోట్లు దోచేశారు!


సినిమా 24 శాఖల కార్మికుల కోసం నిర్మించిన చిత్రపురి కాలనీలో 300 కోట్ల కుంభకోణం జరిగిందని .. కమిటీలో 11మంది జేబుల్లోకి ఆ సొమ్ము వెళ్లిందని ఆరోపించారు సీనియర్ నటుడు ఓ.కళ్యాణ్. దీనిని వ్యతిరేకిస్తూ తాను చాలా కాలంగా పోరాటం సాగిస్తున్నా న్యాయం జరగలేదని కాంట్రాక్టర్లకు సైతం అన్యాయం జరిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు. మూవీ ఆర్టిస్టుల సంఘం.. ఫెడరేషన్ లో తాను పని చేశానని 35ఏళ్లుగా ఇండస్ట్రీని చూస్తున్నానని ఆయన అన్నారు.

ప్రభుత్వం కేటాయించిన 67 ఎకరాల్లో నిజమైన కార్మికులకు ఇండ్లు దక్కకపోగా బయటివారికి ఇచ్చారని ఆరోపించారు. డిసెంబర్ 10న చిత్రపురి కాలనీ హోసింగ్ సొసైటీలో జరిగే ఎన్నికల నేపథ్యంలో సీనియర్ నటుడు ఓ కళ్యాణ్ తన ప్యానల్ సభ్యులతో ప్రెస్ మీట్ నిర్వహించి పైవిధంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్ కావూరి- ఈశ్వర ప్రసాద్ మీసాల- కస్తూరి శ్రీనివాస్- బి నరసింహ రెడ్డి- పసునూరి శ్రీనివాసులు- మన్యవాసి వై వి- శ్రీనివాస కూనపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వం పరిశ్రమ కార్మికుల కోసం 67 ఎకరాలు ఇచ్చింది. 20 ఏళ్లుగా ఇక్కడ అవినీతి జరుగుతోంది. 2001- 2005- 2010- 2015 ఇలా ప్రతీసారి చిత్రపురి హౌసింగ్ లో కార్మికుల సొమ్మును కమిటీ 11 మంది సభ్యులు దోచుకుంటున్నారని అన్నారు. తమ్మారెడ్డి-పరుచూరి-వినోద్ బాల వంటి 11మంది సభ్యులు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. న్యాయం కోసం పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయిందని అన్నారు. సినిమావాళ్లకు ఈఎంఐ కట్టేందుకు లేకే బయటివారిని చేర్చుకున్నామని భర్వాజా అన్నారని తెలిపారు. అయితే పరిశ్రమ తరపున ఫండ్ కలెక్ట్ చేయగలిగినా చేయలేదని అన్నారు. ఈ అన్యాయంపై సి.కళ్యాణ్ వంటి ప్రముఖులకు చెబితే ఆయన భరద్వాజా ప్యానెల్ లో చేరారని విమర్శించారు. చిత్రపురి నిర్మాణంలో వంద కోట్ల నష్టంపై ఆరోపిస్తే ప్రభుత్వం విచారిస్తోందని వెల్లడించారు. కాంట్రాక్ట్ కంపెనీ ఐ.వీ.ఆర్.సి.ఎల్ మొబిలైజేషన్ డిపాజిట్ విషయంలోనూ అవకతవకలు జరిగాయని అన్నారు. కమిటీ వాళ్లు తినేయడంతో 100 కోట్ల ఫ్రాడ్ జరిగిందన్నారు. చిత్రపురి ఎన్నికల సందర్భంగా ప్రస్తుతం వైరి వర్గాలు ఇరు ప్యానెల్స్ మధ్య పోరాటం సాగుతోంది. ఆరోపణలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి.