Templates by BIGtheme NET
Home >> Cinema News >> దర్శకుల దారులన్నీ ఆ స్టార్ హీరో వైపే!

దర్శకుల దారులన్నీ ఆ స్టార్ హీరో వైపే!


బాహుబలితో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఓ పాన్ ఇండియన్ స్టార్ గా ఎదుగుతాడని అంతా అనుకున్నారు కానీ.. దేశంలోనే ఓ అగ్ర నటుడు అవుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం ప్రభాస్ రేంజ్ ఇదీ.. అని చెప్పేందుకు కూడా సాహసించ లేకపోతున్నారు. బాహుబలి చిత్రాల్లాగా.. ‘ సాహో’ కి అండ ఉండదని దేశమంతా.. ముఖ్యంగా బాలీవుడ్ లో బాహుబలిలా ఆదరణ ఉండక పోవచ్చని భావించారు. అయితే అందరి అంచనాలను తలకిందులయ్యాయి. ప్లాపు టాక్ వచ్చినా సాహో వసూళ్లు సాహోరే అనిపించాయి. ఆ తర్వాత మొదలైంది. అసలు సందడి. అప్పటికే రాధా కృష్ణ దర్శకత్వంలో మొదలైన ‘ రాధే శ్యామ్ ‘ తప్ప.. ఆ తర్వాతి సినిమాలు ప్రభాస్ మిడిల్ రేంజ్ బడ్జెట్ లోనే సినిమాలు చేస్తాడని అనుకున్నారు. కానీ ఆయన తన కొత్త సినిమాల అనౌన్స్ మెంట్ తో ఫ్యాన్స్ లో పండుగ తెచ్చాడు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూ. 500 కోట్లతో పాన్ వరల్డ్ సినిమా ప్రకటించాడు. ఇందులో మరో విశేషం ఏంటంటే హీరోయిన్ గా దీపిక పదుకునే నటిస్తుండటం.

ఇక ఆ తర్వాతి సినిమాగా ప్రభాస్ తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ‘ఆది పురుష్ ‘ ఓ సంచలనమే. రామాయణం ఆధారంగా ఈ సినిమా తీయనున్నారు. 3డీ ఎఫెక్ట్స్ గ్రాఫిక్స్ తో తెరకెక్కించనున్నారు. అందుకే ఈ సినిమాను రూ.500 కోట్ల బడ్జెట్ తో తీస్తున్నారు. ఇప్పుడు తాజాగా మరో వార్త చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ప్రస్తుతం యశ్ తో కేజీఎఫ్-2 తీస్తున్నారు. ఆయన తర్వాత సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందని అంతా భావించారు. కానీ ఎన్టీఆర్ నటిస్తున్న ‘ఆర్ఆర్ఆర్’ మూవీ పూర్తి కావలసి ఉండటం ఆ తర్వాత త్రివిక్రమ్ తో ఓ మూవీ ప్రకటించడంతో ఇప్పట్లో ఆయన డేట్స్ దొరికే పరిస్థితి లేదు. దీంతో ప్రశాంత్ నీల్ తన తదుపరి ప్రాజెక్టు ప్రభాస్ తో చేసేందుకు సిద్ధమవుతున్నారు. అగ్ర దర్శకులు ప్రభాస్ తో సినిమా చేస్తే జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించొచ్చని భావిస్తున్నారు. పాన్ ఇండియన్ సినిమాలకు ప్రభాస్ తప్ప వేరే హీరో కనిపించడం లేదు. అందుకే పాన్ ఇండియా స్థాయి కథలతో దర్శకులు ఆయన వద్దకు క్యూ కడుతున్నాయి. ఇప్పుడు ప్రకటించిన సినిమాలతోనే ప్రభాస్ మరో ఐదేళ్ల పాటు బిజీగా గడుపనున్నారు.