Templates by BIGtheme NET
Home >> Cinema News >> ప్ర‌భాస్‌ని చూసి జాగ్ర‌త్త ప‌డుతున్న బాలీవుడ్ హీరో!

ప్ర‌భాస్‌ని చూసి జాగ్ర‌త్త ప‌డుతున్న బాలీవుడ్ హీరో!


ఒక‌రు త‌ప్పు చేశార‌ని, జాగ్ర‌త్త ప‌డ‌లేద‌ని గ‌మ‌నిస్తే మ‌రొక‌రు ఆ త‌ప్పులు చేయ‌డానికి ఇష్ట‌ప‌డ‌రు. అవి జ‌ర‌క్కుండా జాగ్ర‌త్త‌లు పడుతుంటారు. భ‌యం, భ‌యంగా అడుగులు వేస్తుంటారు. ఇప్పుడు బాలీవుడ్ హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ కూడా అదే ఫీల్ అవుతున్నాడా? అంటే బాలీవుడ్ వ‌ర్గాలు అవున‌నే స‌మాధానం చెబుతున్నాయి. ప్ర‌భాస్‌ని చూసి ర‌ణ్ బీర్ క‌పూర్ ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నాడ‌ని అంటున్నారు. వివ‌రాల్లోకి వెళితే..పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ తొలి సారి శ్రీ‌రాముడిగా న‌టించిన మూవీ ‘ఆదిపురుష్‌’.

రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా అత్యంత భారీ బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీని టి సిరీస్ బ్యాన‌ర్‌పై ఓం రౌత్ రూపొందించారు. దాదాపు 500 కోట్ల బ‌డ్జెట్‌తో గ్రాఫిక్స్ ప్ర‌ధానంగా తెర‌కెక్కిన ‘ఆదిపురుష్‌’ ఏ విష‌యంలోనూ అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోలేక‌పోయింది. అంతే కాకుండా దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారి విమ‌ర్శ‌ల‌ని ఎదుర్కొంది. రామాయ‌ణ ఇతిహాసాన్ని వ‌క్రీక‌రిస్తూ ఈ సినిమాని రూపొందించార‌ని, పాత్ర‌ల‌ని చూపించిన తీరు, మేకోవ‌ర్ హిందువుల‌ని కించ‌ప‌రిచేలా ఉన్నాయ‌ని, రామాయ‌ణ గాథ‌ని అప‌హాస్యం చేస్తున్నాయ‌ని ప‌లు రాష్ట్రాల్లో ఈ సినిమా టీమ్‌పై కేసులు న‌మోదు కావ‌డం తెలిసిందే.

ఇదిలా ఉంటే రామాయ‌ణ ఇతిహాసం ఆధారంగా ‘దంగ‌ల్’ ఫేమ్ నితీష్ తివారీ ఓ భారీ సినిమాకు శ్రీ‌కారం చుడుతున్నారు. మ‌ధు మంతెన‌తో పాటు మరి కొంత మంది బాలీవుడ్ నిర్మాత‌ల‌తో క‌లిసి గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అర‌వింద్ నిర్మించ‌బోతున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ జ‌రుగుతోంది. ఇందులో శ్రీ‌రాముడిగా ర‌ణ్ బీర్ క‌పూర్ న‌టించ‌నుండ‌గా, సీత పాత్ర‌లో సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌బోతోంది. వ‌చ్చే ఏడాది ప్ర‌ధ‌మార్థంలో రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

‘ఆదిపురుష్‌’ ఫ‌లితాన్ని, ఈ సినిమా ఎదుర్కొన్న విమ‌ర్శ‌ల‌ని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు నితీష్ తివారీ, హీరో ర‌ణ్ బీర్ క‌పూర్ జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నార‌ట‌. అంతే కాకుండా శ్రీ‌రాముడి పాత్ర కోసం ఇప్ప‌టి నుంచే మందుకు, మాంసాహారానికి దూరంగా ఉండాల‌ని, రాముడి పాత్ర‌ని పూర్తి నిష్ట‌తో చేయాల‌ని ర‌ణ్ బీర్ క‌పూర్ నిర్ణయించుకున్నార‌ట‌. ఇందు కోసం కొత్త డైట్‌ని ఫాలో అవుతున్న‌ట్టుగా బాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ‘కేజీఎఫ్‌’ స్టార్ య‌ష్ రావ‌ణ బ్ర‌హ్మ‌గా న‌టించ‌నున్నారు. త‌న‌కు సంబంధించిన షూటింగ్ వ‌చ్చే ఏడాది ద్వితీయార్థం నుంచి ప్రారంభం కానుంద‌ట‌. రెండు భాగాలుగా రూపొంద‌నున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ఫ‌స్ట్ పార్ట్ 2025లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే మేక‌ర్స్ అధికారికంగా ప్ర‌క‌టించ‌నున్నారు.