Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘నిశ్శబ్దం’ : ట్రైలర్ టాక్

‘నిశ్శబ్దం’ : ట్రైలర్ టాక్


స్టార్ హీరోయిన్ అనుష్క – ఆర్. మాధవన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘నిశబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రానికి హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించారు. కరోనా కారణంగా విడుదల వాయిదా వేసుకున్న ఈ చిత్రం థియేట్రికల్ రిలీజ్ ని రద్దు చేసుకుని.. ప్రముఖ డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదలకు సిద్ధం అయింది. అక్టోబర్ 2న గాంధీ జయంతి స్పెషల్ గా ఈ చిత్రం విడుదల కానుంది. తెలుగు తమిళ భాషలతో పాటు మలయాళ డబ్బింగ్ వర్షన్ ని స్ట్రీమింగ్ కి పెడుతున్నారు. ఈ క్రమంలో తాజాగా ‘నిశ్శబ్దం’ ట్రైలర్ ని దగ్గుబాటి రానా రిలీజ్ చేసాడు.

కాగా ‘నిశ్శబ్దం’ ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. ఒక పెయింటింగ్ కోసం అనుష్క – మాధవన్ ఓ హాంటెడ్ హౌస్ కి వెళ్లడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అయింది. ఇందులో అనుష్క ఓ పెయింటింగ్ కళాకారిణి అయిన మూగ యువతి సాక్షి పాత్రలో కనిపిస్తుంటే.. మాధవన్ ఆంథోనీ అనే మ్యూజిషియన్ గా కనిపిస్తున్నారు. అమెరికాలో ఓ ఇంట్లో జరిగే సంఘటనల చుట్టూ సినిమా కథ నడిచినట్టుగా ట్రైలర్ ను బట్టి అర్ధం అవుతోంది. అనుష్క బెస్ట్ ఫ్రెండ్ షోనాలి పాత్రలో షాలిని పాండే కనిపిస్తోంది. ఎంగేజ్మెంట్ అయిన రెండో రోజు నుంచి షోనాలి కనబడకుండా పోయింది అని చెప్పడం ద్వారా సినిమాలో ఆమె పాత్రకి ప్రాధాన్యత ఉందని తెలుస్తోంది. అంజలి – సుబ్బరాజు లు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ గా కనిపించారు. మొత్తానికి ట్రైలర్ ను సస్పెన్స్ అంశాలతో థ్రిల్ ని కలిగించారు. ఇక ఈ సినిమా ఎలా ఉండబోతోందో తెలియాలంటే అక్టోబర్ 2 వరకు వేచి చూడాల్సిందే.

ఇక ఈ సినిమాలో హాలీవుడ్ నటులు మైఖేల్ మ్యాడ్సన్ – హంటర్ ఓ హరో మరియు శ్రీనివాస అవసరాల ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ టీజీ విశ్వప్రసాద్ – వివేక్ కూచిభోట్ల మరియు కోన ఫిల్మ్ కార్పొరేషన్ కోన వెంకట్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రానికి గోపీ సుందర్ సంగీతం అందించగా గిరీష్ గోపాలకృష్ణన్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. షానైల్ డియో సినిమాటోగ్రఫీ అందించారు. ‘భాగమతి’ సినిమా తరువాత అనుష్క చాలా గ్యాప్ తీసుకొని చేస్తున్న మూవీ కావడంతో ‘నిశ్శబ్దం’పై భారీ అంచనాలు ఏరపడ్డాయి.