Templates by BIGtheme NET
Home >> Telugu News >> ప్రగతి భవన్ కాదు..ప్రజా భవన్: రేవంత్ రెడ్డి

ప్రగతి భవన్ కాదు..ప్రజా భవన్: రేవంత్ రెడ్డి


తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగించిన సంగతి తెలిసిందే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు తగ్గట్టుగానే తెలంగాణను కాంగ్రెస్ ‘హస్త’ గతం చేసుకుంది. ఈ నేపథ్యంలోనే ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారిగా మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రత్యేక తెలంగాణ కోసం అమరుడైన శ్రీకాంతాచారిని రేవంత్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ విజయం తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నామని చెప్పారు. డిసెంబర్ 3న శ్రీకాంతాచారి తెలంగాణ కోసం అమరుడయ్యారని, అదే రోజున ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం కాంగ్రెస్ పార్టీని ప్రజలు గెలిపించుకున్నారని రేవంత్ అన్నారు.

ఈ గెలుపుతో కాంగ్రెస్ బాధ్యతను ప్రజలు మరింత పెంచారని చెప్పారు. భారత్ జోడో యాత్రతో రాహుల్ గాంధీ స్ఫూర్తిని నింపారని, తనతో పాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పార్టీని ముందుకు నడిపించామని చెప్పారు. పార్టీలోని సీనియర్ నాయకులందరి సహాయ సహకారాలతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని, ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని రేవంత్ అన్నారు. సిపిఐ, సిపిఎం, టీజేఎస్ లతో కలిసి ముందుకు పోతామని అన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు బీఆర్ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నట్టుగా రేవంత్ చెప్పారు. ఇక, ప్రగతి భవన్ పేరును డాక్టర్ అంబేద్కర్ ప్రజా భవన్ గా మారుస్తామని ఆయన అన్నారు.

అంతే కాకుండా సామాన్య ప్రజలందరికీ ప్రజాభవన్లో ప్రవేశం ఉంటుందని రేవంత్ చెప్పారు. ఇక, సచివాలయం గేట్లు కూడా అందరి కోసం తెరుచుకుంటాయని రేవంత్ క్లారిటీనిచ్చారు. ఇన్నాళ్లు తమకు అండగా నిలబడిన రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు అని, ఆయన అండతోనే కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిందని అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిక్రావు ఠాక్రేకు ధన్యవాదాలు చెప్పిన రేవంత్ ఈ విజయంలో విజయశాంతి పోషించిన పాత్ర పట్ల కృతజ్ఞతలు చెప్పారు. తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ అని ఆమెకు కృతజ్ఞత తెలిపే అవకాశం రావడంతో ప్రజలు దానిని సద్వినియోగం చేసుకున్నారని రేవంత్ అన్నారు.

ప్రభుత్వ నిర్ణయాలపై హేతుబద్ధంగా వాదనలు వినిపించే అవకాశాన్ని ప్రతిపక్షాలకు కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పారు. ప్రభుత్వ ఏర్పాటు కార్యక్రమానికి ప్రతిపక్షాలతో పాటు అందరినీ ఆహ్వానిస్తామని, కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నానని రేవంత్ అన్నారు.