Templates by BIGtheme NET
Home >> Telugu News >> నామినేషన్ వేళ.. సచిన్ పైలెట్ ఇంటి గుట్టు బయటకొచ్చింది

నామినేషన్ వేళ.. సచిన్ పైలెట్ ఇంటి గుట్టు బయటకొచ్చింది


రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక విషయం వెలుగులోకి వచ్చింది. రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, భార్య సారా నుంచి విడిపోయారని తెలిసింది! సచిన్ పైలట్ ఎన్నికల అఫిడవిట్‌ లో భాగంగా… వీరిద్దరి మధ్య విడాకుల విషయం వెలుగులోకి వచ్చింది. మతాలు వేరైనా సారా, సచిన్ పైలట్ జనవరి 2004లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో తాజాగా వీరి విడాకుల విషయం చర్చనీయాంశం అయ్యింది.

అవును… రాజస్థాన్ మాజీ ఉప ముఖ్యమంత్రి సచిన్ పైలట్, అతని భార్య సారా ఇప్పుడు విడాకులు తీసుకున్నట్లు పో ల్ అఫిడవిట్ ద్వారా వెలుగులోకి వచ్చింది. దీంతో.. వీరి విడాకుల వార్త మొదటిసారిగా పబ్లిక్‌ లో చర్చనీయాంశం అవుతుంది. నామినేషన్‌ లో ఇచ్చిన అఫిడవిట్‌ లో, “స్పౌస్” అనే ఆప్షన్‌ వద్ద డివోర్స్‌ అని పేర్కొనడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

జమ్మూకశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా కుమార్తె అయిన సారా అబ్దుల్లాను సచిన్‌ పైలట్‌ 2004లో వివాహం చేసుకున్నారు. అప్పట్లో వీరి వివాహం దేశవ్యాప్తంగా సంచలన సృష్టించింది. సారా కుటుంబం ఈ వివాహాన్ని బహిష్కరించింది. ఇలా జరిగిన వీరి మతాంతర వివాహం హాట్ టాపిక్ గా మారింది. వీరికి ప్రస్తుతం ఇద్దరు కుమారులు అరాన్‌, విహాన్‌ ఉన్నారు.

సచిన్ – సారా ఇద్దరి కుటుంబాలు రాజకీయాల్లో యాక్టివ్ గాఉన్నవే. దివంగత కాంగ్రెస్ నేత రాజేష్ పైలట్ కుమారుడు సచిన్ పైలట్ కాగా… జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా కుమార్తె.. నేషనల్‌ కాన్ఫరెన్సు నేత ఒమర్ అబ్దుల్లాకు స్వయాన సోదరి ఈ సారా! వీరి ప్రేమకథ లండన్ లో ప్రారంభమైందని చెబుతారు.

సచిన్ పైలట్ పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయంలోని వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎంబీయే అభ్యసించడానికి విదేశాలకు వెళ్ళారు. 1990 తర్వాత కాశ్మీర్ లోయలో కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా, ఫరూక్ అబ్దుల్లా సారాను ఆమె తల్లితో కలిసి లండన్‌ కు పంపారు. ఈ నేపథ్యంలో… సారా, సచిన్‌ లు తొలిసారి లండన్‌ లో కలుసుకున్నారు.

అలా జరిగిన పరిచయం, స్నేహంగా.. ప్రేమగా మారింది. ఈ క్రమంలోనే 2004లో వీరి వివాహం పెద్దల అనుమతి లేకుండా జరిగింది. ఈ నేపథ్యంలో తాజా అఫిడవిట్ లో తన భార్యతో విడాకులు అయినట్లు సచిన్ పేర్కొన్నారు. దీంతో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది.

కాగా… నవంబర్ 25న రాజస్థాన్‌ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా అక్టోబర్ 31న సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా సమర్పించిన అఫిడవిట్ ద్వారా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.