Templates by BIGtheme NET
Home >> Telugu News >> టీడీపీ యువగళానికి ఎల్లలు దాటిన అభిమానం.. గల్ఫ్‌లో లోకేశ్ కి ఏ రేంజ్‌ సపోర్ట్ ఉందంటే..

టీడీపీ యువగళానికి ఎల్లలు దాటిన అభిమానం.. గల్ఫ్‌లో లోకేశ్ కి ఏ రేంజ్‌ సపోర్ట్ ఉందంటే..


తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ప్రారంభించిన యువ గళం పాదయాత్రకు గల్ఫ్ దేశాలలో తెలుగు దేశం పార్టీ అభిమానులతో పాటు కొంత మంది జనసేన కార్యకర్తలు ఇతరులు కూడా శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో రాకపోకలకు అంతరాయం ఏర్పడినా ప్రవాసాంధ్ర పార్టీ అభిమానులందరు అమిత ఆసక్తితో సంఘీభావ సమావేశాలలో పాల్గొన్నారు.

సౌదీ అరేబియాలో..
‘యువగళం’ పాదయాత్రకు సంఘీభావం తెలుపుతూ.. సౌదీ అరేబియాలోని అల్ ఖోబర్ నగరంలో అట్టహాసంగా జరిగిన కార్యక్రమంలో వివిధ ప్రాంతాలకు చెందిన ఔత్సాహిక మహిళలతో సహా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ, కర్ణాటక మరియు కేరళ రాష్ట్రాలలోని వివిధ రాజకీయ పార్టీల సానుభూతిపరులయిన డాక్టర్లు, ప్రొఫెసర్లు, ఇంజినీర్లు కూడా కార్యక్రమంలో భాగమయ్యారు. తెలుగుదేశం పార్టీ గల్ఫ్ విభాగం అధ్యక్షుడు రావి రాధాకృష్ణ అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఒక రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక యువ రాజకీయ నాయకుడు పాదయాత్ర చేపట్టడం ఒక్క ఆంధ్రాలోనే కాకుండా దేశ రాజకీయాలలో కూడా నూతన ఒరవడి అని వక్తలు ప్రశంసించారు.

తెలుగుదేశం పార్టీ సౌదీ అరేబియా అధ్యక్షుడు ఖాలీద్ సైఫుల్లా, భరద్వాజ, చంద్రశేఖర్, విజయబాబు, భాను ప్రకాశ్, పవన్, అవినాష్, నవీన్, సత్య, నియాజ్, బుడే శ్రీనివాస్, వహీద్ అలీ, యన్.చంద్రశేఖర్, అజం, ముంతాజ్ అహ్మద్, అహ్మద్ అలీ, అబ్దుల్, రమేశ్, జొన్నలగడ్డ రమేశ్, చివులకల శర్మ, సతీష్, మోహమ్మద్ అలీ, ఇంతియాజ్, అక్బర్ అలీ, తేజ, భాను జి, అడబల భాస్కర్, చిన్న అడబల, నర్సింహాం, శేషూ బాబు, అనిల్ కుమార్ తదితర ప్రముఖులు పాల్గొని లోకేశ్ యువగళం పాదయాత్రకు సంఘీభావం ప్రకటించారు. తెలుగు ప్రముఖులు హాకీం దౌలా, వారీస్, హస్నేన్ కూడా వచ్చి లోకేశ్ కు మద్దతు ప్రకటించారు.

మాతృభూమిపై మమకారంలో తామేమి తక్కువ కాదంటూ మాదాల ఝాన్సీ, బలుసు వారధిని, ఫణి శ్రావ్య, ఉండవల్లి లక్ష్మిదేవి, మట్లపార్ధి సమేరా, వెంకటనాగ శ్రీ సంధ్య దేవిక పిల్ల కూడా లోకేశ్ యాత్రకు సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా వెంకటనాగ శ్రీ సంధ్య దేవిక చేసిన ప్రసంగం అందర్ని అలోచింపచేసింది.

ఖతర్‌లో…
ఎడారి దేశాన ఉన్నా మనసంతా ఆంధ్రాపై ఉండే, ఖతర్‌లోని తెలుగు దేశం పార్టీ అభిమానులు కూడా ఉరకలేసిన ఉత్సాహాంతో లోకేశ్ పాదయాత్ర సంఘీభావ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఖతర్ పార్టీ అధ్యక్షుడు గొట్టిపాటి రమణ అధ్వర్యంలో ఈ సందర్భంగా పాదయాత్రను కూడా నిర్వహించి మరీ తమ అభిమానాన్ని చాటారు. కార్యక్రమంలో మద్దిపోటి నరేష్, మలిరెడ్డి సత్యనారాయణ, విక్రం సుఖవాసి, గోవర్ధన్, రమేష్, కిరణ్ వాసు, రవి కిషోర్, సతీష్ బాబు, శబరీష్, సాయి రమేశ్, వెంకప్ప, సతీష్, ఫణి తదితరులు పాల్గోన్నారు.

ప్రతికూల వాతావారణ పరిస్ధితులు నెలకొన్న బహ్రెయిన్‌లో చిన్నా,పెద్దా తేడా లేకుండా తెలుగుదేశం పార్టీ అభిమానులు కుటుంబాలతో సహా సంఘీభావ కార్యక్రమంలో పాల్గోన్నారు. బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రఘునాథ బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జి.సి.సి. ప్రతినిధి హరిబాబు మరియు పార్టీ ప్రముఖులు బాలకృష్ణా, శివకుమార్, బొల్ల సతీష్, ఎ.వి.రావు, చంద్రబాబు, కోటేశ్వర రావులతో పాటు మహిళ ప్రతినిధులు స్రవంతి, సుష్మా, స్వాతి, దివ్య, శ్రీవాణి, సంధ్యలు పాల్గోన్నారు.

దేనిపై అయినా అభిమానం హద్దులు దాటితే ఆపద అంటుంటారు. సరిగ్గా అదే పరిస్ధితి కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ మద్దతుదారులది. రాయలసీమ జిల్లాలు ప్రత్యేకించి కడప జిల్లాకు చెందిన సంఖ్యాబలం ఎక్కువగా ఉన్న కువైత్ చాలా చిన్న దేశమైనా కలహాలకు కాపురంగా పేరు. కువైత్‌లోని తెలుగుదేశం పార్టీ రెండు వర్గాలు కూడా పోటాపోటీగా ఒకే ప్రదేశంలో కొన్ని గంటల తేడాతో సంఘీభావ సమావేశాన్ని నిర్వహించి లోకేష్ యువగళంకు మద్దతు ప్రకటించాయి.

ఒమన్‌‌లో…
ఒమన్ రాజధాని మస్కట్‌లో నిర్వహించిన సంఘీభావ సమావేశం కూడా అంచనాలకు మించి విజయవంతమైనట్లుగా ఒమన్ తెలుగు దేశం పార్టీ నాయకులు వెల్లడించారు. ఒమన్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మోహమ్మద్ ఇమాం అధ్యక్షతన జరిగిన సమావేశంలో పార్టీ ప్రముఖులు వెంకట శ్రీధర్, రాజు సాగర్ తదితరులు యువగళం ఆవశ్యకత గురించి వివరించారు.

దుబాయి (యు.ఏ.ఇ)లో ..
వర్షాల కారణంగా వివిధ ఎమిరేట్ల నుంచి రాకపోకల సమస్యతో శుక్రవారం దుబాయిలో సంఘీభావ కార్యక్రమాన్ని రద్దు చేసిననట్లుగా తెలుగుదేశం దుబాయి అధ్యక్షులు యం. విశ్వేశ్వరరావు తెలిపారు. త్వరలో సమావేశాన్ని నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు