Templates by BIGtheme NET
Home >> Cinema News >> క్రిటికల్‌గానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..

క్రిటికల్‌గానే తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. బెంగళూరుకు ఎన్టీఆర్, కల్యాణ్ రామ్..


‘యువగళం’ (YuvaGalam) పాదయాత్రలో నడుస్తూ గుండెపోటుకు గురైన సినీ నటుడు నందమూరి తారకరత్న (TarakaRatna Heart Attack) ఆరోగ్య పరిస్థితి (TarakaRatna Condition Critical) ఆందోళనకరంగానే ఉంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు బెంగళూరులోని నారాయణ హృదయాలయ వైద్యులు హెల్త్ బులిటెన్‌లో వెల్లడించారు. దీంతో నందమూరి, టీడీపీ అభిమానుల్లో ఆందోళన మరింత పెరిగింది. తారకరత్నకు ఎక్మో (ECMO) పరికరం ద్వారా కృత్రిమ శ్వాసను అందిస్తున్నారు.

ప్రత్యేక విమానంలో..
మరోవైపు.. తారకరత్నను చూసేందుకు సోదరులు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) , కల్యాణ్ రామ్ (Kalyan Ram) ఆదివారం నాడు బెంగళూరుకు (Bangalore) వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం ప్రత్యేక విమానంలో (Special Flight) హైదరాబాద్ (Hyderabad) నుంచి బయల్దేరి వెళ్లనున్నారు. సోదరుడి ఆరోగ్యపరిస్థితిపై వైద్యుల బృందంతో మాట్లాడనున్నారు. ఇప్పటికే పలుమార్లు బాబాయ్.. బాలకృష్ణకు (Balakrishna) ఫోన్ చేసి తారకరత్న ఆరోగ్యపరిస్థితిపై ఎన్టీఆర్ ఆరాతీశారు. శనివారం రాత్రే బెంగళూరుకు వెళ్లాలని ఎన్టీఆర్ భావించినా కొన్ని అనివార్యకారణాల వల్ల ఆదివారం వెళ్తున్నారు. ఇప్పటికే మోహనకృష్ణ, తారకరత్న సతీమణి, పిల్లలు, నందమూరి బాలకృష్ణ, పురంధేశ్వరి (Daggubati Purandeswari) , సుహాసినితో (Suhasini) పాటు కుటుంబ సభ్యులంతా ఆస్పత్రిలోనే ఉన్నారు. ఐసీయూలో (ICU) చికిత్స తీసుకుంటున్న తారకరత్న ఆరోగ్యపరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. మరోవైపు.. టీడీపీ ముఖ్యనేతలు కూడా బెంగళూరుకు చేరుకున్నారు. ఇక.. కార్డియాలజిస్ట్‌లు, ఇంటెసివిస్ట్‌లు, ఇతర స్పెషలిస్టులు తారకరత్న ఆరోగ్యాన్ని ఎప్పుటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.

అబ్జర్వేషన్‌లో తారకరత్న..

ఇదిలా ఉంటే.. శనివారం సాయంత్రం టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) బెంగళూరులోని ఆస్పత్రికి చేరుకున్నారు. ఐసీయూలో చికిత్స పొందుతున్న తారకరత్నను చూసి.. వైద్యులు, కుటుంబ సభ్యులుతో మాట్లాడారు. తారకరత్నను అబ్జర్వేషన్‌లో పెట్టారని చంద్రబాబు తెలిపారు. ఐసీయూలో తారకరత్నకు చికిత్స అందుతోందని.. ఎప్పుటికప్పుడు వైద్యులు పర్యవేక్షిస్తున్నారన్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో మాట్లాడానని.. బ్లాక్స్ ఎక్కువగా ఉన్నందున కోలుకోవడానికి టైమ్ పడుతుందన్నారు. తారకరత్న త్వరలో కోలుకుంటారని భావిస్తున్నామని చంద్రబాబు తెలిపారు. మరోవైపు.. తారకరత్న ఆరోగ్యం క్రిటికల్‌గా ఉందని పురంధేశ్వరి తెలిపారు. సోమవారం మరోసారి వైద్య పరీక్షలు చేస్తామని డాక్టర్లు చెప్పినట్లు పురంధేశ్వరి మీడియాకు వెల్లడించారు.