Templates by BIGtheme NET
Home >> Telugu News >> కరోనా అంటించుకుని కాసులు సంపాదిస్తున్న విద్యార్థులు.. యూనివర్శిటీ సీరియస్!

కరోనా అంటించుకుని కాసులు సంపాదిస్తున్న విద్యార్థులు.. యూనివర్శిటీ సీరియస్!


కరోనా వైరస్‌ను అడ్డుపెట్టుకుని ఇప్పటికే మన ప్రైవేట్ హాస్పిటళ్లు ఎంతగా దండుకుంటున్నాయో తెలిసిందే. రూ.100తో వచ్చే మందులను ఏసీ రూముల్లో పెట్టి రోగులకు మింగిస్తూ.. లక్షలు మింగేస్తున్నాయనే ఆరోపణలు వస్తున్నా.. లంచం మరిగిన అధికారులు తూతూ మంత్రంగా తనిఖీలు చేస్తున్నారనేది పబ్లిక్ టాక్. అయితే, ఇప్పుడు కేవలం ప్రైవేట్ హాస్పిటళ్లు మాత్రమే కాదండోయ్. కొంతమంది విద్యార్థులు కూడా దీన్నీ బాగానే క్యాష్ చేసుకుంటున్నారట. ఇందుకు ఏకంగా వారి ప్రాణాలనే ఫణంగా పెడుతున్నారట.

అమెరికాలోని ఇదహోలో గల బ్రిఘం యంగ్ యూనివర్శిటీ తమ విద్యార్థులపై విచారణకు ఆదేశాలు జారీ చేసింది. ఎందుకంటే.. తమ విద్యార్థులు కావాలనే కరోనా వైరస్‌ను అంటించుకుంటున్నారని యాజమాన్యానికి తెలిసింది. ఇలా వైరస్‌ను అంటించుకోవడం ప్రాణాలకే ప్రమాదం కదా అనే ప్రశ్నకు యూనివర్శిటీ అధికారులు షాకింగ్ విషయాన్ని చెప్పారు.

ఇలా వైరస్‌ను అంటించుకుంటున్న విద్యార్థులు.. కోలుకున్న తర్వాత తమ ప్లాస్మాను హాస్పిటళ్లకు అమ్ముకుంటున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో యూనివర్శిటీ.. తమ విద్యార్థులకు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఎవరైనా వైరస్‌ను కావాలని అంటించుకున్నట్లయితే సస్పెండ్ చేస్తామని ప్రకటించింది. అంతేగాక, ఇప్పటికే Covid-19కు గురైన విద్యార్థులపై విచారణకు ఆదేశించింది. డబ్బులు కోసం మీ ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోవద్దని హెచ్చరించింది.

ఈ సందర్భంగా బ్రిఘమ్ యంగ్ యూనివర్శిటీ అధికారులు మాట్లాడుతూ.. ‘‘కరోనా వైరస్‌ను అంటించుకోవడం, దాన్ని ఇతరులకు వ్యాప్తి చేయడమనేది చిన్న విషయం కాదు. ఆరోగ్యంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ముప్పు. ఇది కేవలం వారికి మాత్రమే కాదు.. వారితో కలిసి ఉండే ఇతరులకు కూడా ప్రమాదకరమే. విద్యార్థులు ఎవరైనా ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నట్లయితే.. వారికి సాయం చేయడానికి కూడా యూనివర్శిటీ సిద్ధంగా ఉంది. ఇందుకు తమ ప్రాణాలను ఫణంగా పెట్టడం మంచిది కాదు’’ అని తెలిపారు. ఇప్పటివరకు ఈ యూనివర్శిటీకి చెందిన 119 మంది విద్యార్థులకు, 20 మంది ఉద్యోగులకు కరోనా వైరస్ సోకినట్లు పేర్కొన్నారు.

స్థానిక వార్తా సంస్థల కథనం ప్రకారం.. కొన్ని సంస్థలు కరోనా నుంచి కోలుకున్న వ్యక్తుల నుంచి యాంటీబాడీ ప్లాస్మాలను సేకరిస్తోందని, ఇందుకు సుమారు 100 డాలర్ల నుంచి 200 డాలర్లు (రూ.7,350 నుంచి రూ.14700) చొప్పున చెల్లిస్తున్నాయి. దీంతో విద్యార్థులు పోకెట్ మనీ కోసం వైరస్‌ను అంటించుకుని తమ ప్లాస్మను అమ్ముకుంటున్నారు. యువతను కరోనా వైరస్ ఏమీ చేయదనే ప్రచారం వల్ల విద్యార్థులు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. అయితే, వారి రోగనిరోధక శక్తిపై అంచనా లేకుండా వైరస్‌ను అంటించుకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని, లేదా ఆ వైరస్ భవిష్యత్తులో కొత్త రకం సమస్యలు ఏర్పడవచ్చని వైద్యులు హెచ్చరిస్తున్నారు.