బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ విషాదకరమైన మరణం వెనక కూపీ లాగుతున్న కొద్దీ ఆసక్తికర విషయాలు బయటపడుతున్నాయి. ఇందులో డ్రగ్స్ డొంక కదలడంతో బిగ్ షాట్స్ పేర్లు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్కరిని పిలిచి ఎన్.సి.బి విచారణ సాగిస్తుంటే అందరిలో ఒకటే టెన్షన్ వాతావరణం అలుముకుంది.
ఓవైపు నెపోటిజం.. సినీసోదర భావం పైనా.. బాలీవుడ్ పార్టీ కల్చర్ పైనా యువతరంలో ఆసక్తికర చర్చ సాగుతోంది. గత కొద్దిరోజులుగా బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ పై విమర్శలు తెలిసిందే. నెటిజనులు ఓవైపు.. మీడియా మరోవైపు కరణ్ పై విరుచుకుపడడం చూస్తున్నదే. ఎన్.సిబి దర్యాప్తు చేస్తున్న సంచలనాత్మక మాదకద్రవ్యాల కేసుకు సంబంధించి కరణ్ గత కొన్ని రోజులుగా మీడియా విచారణను ఎదుర్కొంటున్నాడు.
తనపై మీడియా వేటను తీవ్రంగా ఖండిస్తూ.. కరణ్ ట్విట్టర్ లో సుదీర్ఘ నోట్ ను పోస్ట్ చేశాడు. మొదట అతను గత సంవత్సరం తన నివాసంలో నిర్వహించిన పార్టీలో ఎలాంటి మాదకద్రవ్యాల ఉనికిని ఖండించారు. తాను మాదకద్రవ్యాలను సేవించడం లేదా అలాంటి పదార్థాన్ని ప్రోత్సహించ లేదని కరణ్ పేర్కొన్నాడు. ఎన్.సిబి పిలిపించి విచారిస్తున్న క్షితిజ్ ప్రసాద్ .. అనుభవ్ చోప్రా తనకు వ్యక్తిగతంగా తెలియదని.. కొంతమంది వ్యక్తులు తమ వ్యక్తిగత జీవితంలో చేసే పనులకు అతను లేదా ధర్మ ప్రొడక్షన్స్ బాధ్యత వహించడం కుదరదని చెబుతూ.. మీడియా చేసిన వాదనలను కరణ్ ఖండించారు.
అయితే కరణ్ జోహార్ ఇంట్లో జరిగిన 2019 పార్టీలో ఒక తెల్లని కాంతిపుంజపు పదార్థాన్ని గుట్టు చప్పుడు కాకుండా ఉపయోగించారని చెబుతూ నెటిజనులు ఓ వీడియోని వైరల్ చేయడం ఇటీవల హాట్ టాపిక్ గా మారింది. దీనిపై ఒక రాజకీయ నాయకుడు తీవ్రంగానే ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఆ క్రమంలోనే ఎన్.సి.బి దర్యాప్తు కోసం ఆ వీడియోని సేకరించి విచారిస్తోంది.