Templates by BIGtheme NET
Home >> Cinema News >> హీరోగా మారుతున్న మరో కమెడియన్ సత్య…?

హీరోగా మారుతున్న మరో కమెడియన్ సత్య…?


తెలుగు చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఎంతో మంది హాస్యనటులు తమ కామెడీతో నవ్విస్తూనే.. మరో అడుగు ముందుకేసి హీరోగా మారారు. ఈ క్రమంలో లేటెస్టుగా మరో కమెడియన్ హీరోగా మారబోతున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్ లో తనదైన మార్క్ కామెడీతో అలరిస్తూ మోస్ట్ వాంటెడ్ కమెడియన్ గా ఉన్న సత్య ఇప్పుడు హీరోగా నటిస్తున్నాడు. హీరో సందీప్ కిషన్ తన హోమ్ బ్యానర్ లో నిర్మించే సినిమాలో సత్యను హీరోగా తీసుకుంటున్నాడట. ఇటీవల ‘వివాహ భోజనంబు’ అనే టైటిల్ తో హీరో ఫేస్ కనిపించకుండా ఓ పోస్టర్ రిలీజ్ చేసాడు సందీప్ కిషన్. హీరో సత్య అని ప్రకటించనప్పటికీ ఇండస్ట్రీ వర్గాల సమాచారం ఈ సినిమాలో హీరో సత్య అని తెలుస్తోంది.

కాగా ఇప్పటి వరకు బ్రహ్మానందం – అలీ – వేణు మాధవ్ – సునీల్ – శ్రీనివాస్ రెడ్డి – షకలక శంకర్ – సప్తగిరి లాంటి కమెడియన్స్ హీరోలుగా మారి పలు చిత్రాల్లో నటించారు. ఇటీవల సుహాస్ కూడా ‘కలర్ ఫోటో’ సినిమాతో హీరోగా మారాడు. అయితే వీళ్ళలో చాలామంది హీరోలుగా సినిమాలు తీస్తూనే కమెడియన్ గా కూడా కొనసాగారు. సునీల్ – సప్తగిరి లాంటి కొందరు కమెడియన్స్ మాత్రం హీరోలుగా సినిమాలు తీసిన తర్వాత కామెడీ పాత్రలకు దూరంగా ఉంటూ వచ్చారు. కాకపోతే ఇప్పటి వరకు వీరిని హాస్యనటులుగా ఆదరిస్తూ వచ్చిన ప్రేక్షకులు వారి నుండి హీరోయిజం సినిమాలు కాకుండా కామెడీ చిత్రాలు ఎక్సపెక్ట్ చేశారు. అందుకే వారు నటించిన హీరోయిజం సినిమాలు పరాజయం చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు హాస్యనటుడు సత్య కూడా హీరోయిజం సినిమాలు కాకుండా కామెడీ నేపథ్యంలో ఉండే సినిమాల్లో నటిస్తే ప్రేక్షకులు ఆదరించే అవకాశం ఉంది. అందులోనూ అలీ – శ్రీనివాస్ రెడ్డి వలె కమెడియన్స్ గా కొనసాగుతూనే అప్పుడప్పుడు హీరోలుగా నటిస్తే కెరీర్ పరంగా బాగుంటుందని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.