Templates by BIGtheme NET
Home >> Cinema News >> విష్ణు ఇందూరి అబద్ధాలతో జీవిస్తూ అవి అబద్ధాలనే విషయం కూడా మర్చిపోయాడు : దేవ కట్టా

విష్ణు ఇందూరి అబద్ధాలతో జీవిస్తూ అవి అబద్ధాలనే విషయం కూడా మర్చిపోయాడు : దేవ కట్టా


‘ప్రస్థానం’ ‘వెన్నెల’ ‘ఆటోనగర్ సూర్య’ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న దేవ కట్టా.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ తో ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు అనూహ్యంగా విష్ణు ఇందూరిపై సంచలన ఆరోపణలు చేసి తెరపైకి వచ్చాడు దేవ కట్టా. తన ఐడియాస్ ని హైజాక్ చేసి ఎన్టీఆర్ బయోపిక్ రూపొందించారని.. ఒకసారి మోసపోయాను కానీ మరోసారి మోసపోవడానికి సిద్ధంగా లేను అంటూ కామెంట్స్ చేసారు. దివంగత వై.ఎస్. రాజశేఖర రెడ్డి – మాజీ సీఎం నారా చంద్రబాబు మధ్య ఉన్న స్నేహాన్ని మరియు రాజకీయ వైరాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఓ ఫిక్షనల్ వెబ్ సిరీస్ చేయబోతున్నట్టు డైరెక్టర్ రాజ్ ప్రకటించాడు. రెండు భాగాలుగా రాబోతున్న ఈ వెబ్ సిరీస్ ను విష్ణు ఇందూరి నిర్మించబోతున్నారంటూ కథనాలు వెలువడ్డాయి.

కాగా దర్శకుడు దేవ కట్టా దీనిపై స్పందించి.. ”గాడ్ ఫాదర్ సినిమా స్ఫూర్తితో వైఎస్ రాజశేఖర రెడ్డి నారా చంద్రబాబు నాయుడు స్నేహం మరియు రాజకీయ వైరంపై మూడు భాగాలుగా స్క్రిప్ట్ రెడీ చేశాను. ఆ తర్వాత దాన్ని వెబ్ సిరీస్ ఫార్మాట్ లోకి మార్పు చేసి నా ఐడియాను పలు ఓటీటీ ప్లాట్ ఫామ్ లకు వివరించాను. అయితే గతంలో నా స్క్రిప్ట్ దొంగిలించి సినిమా తీసి డిజాస్టర్ అందుకున్న ఓ వ్యక్తి ఇప్పుడు కూడా అదే పని చేస్తున్నాడు. కానీ ఈసారి అలా కానివ్వను” అన్నారు. అంతేకాకుండా ”నేను దర్శకుడు రాజ్ గురించో లేదా చదరంగం గురించో మాట్లాడటం లేదు. నేను 2015 డిసెంబర్ లో విష్ణు ఇందూరితో జరిగిన ‘ఎన్టీఆర్ బయోపిక్’ చర్చల గురించి మాత్రమే మాట్లాడుతున్నాను” అని మరో ట్వీట్ చేసి తాను ఎవరిని ఉద్దేశించి ట్వీట్స్ చేసాడో క్లారిటీ ఇచ్చాడు. అయితే దీనిపై విష్ణు ఇందూరి స్పందిస్తూ.. ”2015లో ఓ రీమేక్ కోసం దేవా కట్టాని కలిశాను. అప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ ఐడియాని బేసిక్ స్క్రీన్ప్లే తో తనకు చెప్పాను. ఆ ఐడియా తనకు నచ్చింది. అంతేకానీ ఎన్టీఆర్ బయోపిక్ గురించి అతను నాకేం చెప్పలేదు” అని చెప్పుకొచ్చాడు.

ఇదిలా ఉండగా తాజాగా ఓ వెబ్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దేవ కట్టా మరోసారి ఈ వివాదంపై స్పందించారు. ‘విష్ణు ఇందూరి ఏ విధంగా అయినా నా ఎఫర్ట్స్ ని నా ఫిక్షనల్ ఆలోచనలను కాపీ చేసినా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని’ హెచ్చరించారు. ‘ఇండస్ట్రీలో ఎవరిని అడిగినా విష్ణు ఇందూరి గురించి చెప్తారని.. తనతో మీటింగ్ జరగకముందే అతని గురించి నాకు చాలామంది హెచ్చరించారని.. అబద్ధాలలో బ్రతికే వారు కొన్ని రోజుల్లో అబద్ధాలు చెప్తున్నామనే విషయం కూడా మర్చిపోతుంటారు.. విష్ణు ఇందూరి కూడా అదే విధంగా జీవిస్తున్నాడు’ అని పేర్కొన్నాడు. ”2015లో హిందీ ‘రాజనీతి’ సినిమాని తెలుగులో రీమేక్ చేయమని అడిగాడు.. అయితే ఆ మూవీని రీమేక్ చేయకుండా కేవలం ఐడియాని తీసుకొని నా ఓన్ స్క్రిప్ట్ డెవలప్ చేస్తానని చెప్పాను. అదే సమయంలో ఎన్టీఆర్ బయోపిక్ కి సంబంధించి బేసిక్ ఐడియా చెప్పాను. అప్పుడు మా మధ్య మరో విట్నెస్ కూడా ఉన్నారు. అయితే మూడేళ్ళ తర్వాత నేను చెప్పిన ఐడియాతో వేరే టీమ్ తో స్క్రిప్ట్ రెడీ చేసుకొని నన్ను డైరెక్ట్ చేయమని అడిగారు. ఆ స్క్రిప్ట్ లో నా సోల్ లేకపోవడం ఇబ్బందిగా అనిపించింది. అందులోనూ డేట్స్ క్లాష్ ఉండటం వల్ల నేను ఈ ప్రాజెక్ట్ చేయలేనని డైరెక్టుగా బాలయ్య బాబుకి చెప్పాను” అని దేవా చెప్పుకొచ్చాడు.

అంతేకాకుండా ”విష్ణు ఇందూరితో జరిగిన సంభాషణకు సంబంధించి నా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి.. ఏడెనిమిది మీటింగ్స్ కి సంబంధించిన వాట్సాప్ మెసేజెస్ అన్నీ ఉన్నాయి.. నేను కోర్టు కేసు వేస్తానని ఇప్పుడు దీని గురించి చెప్పడం లేదు. అవతలి వ్యక్తి అబద్ధాలు చెప్తున్నాడు కాబట్టి నిజం ఇదని మాత్రమే చెప్తున్నాను. నిన్న జరిగిన ఇష్యూ వల్ల నిన్న ట్విట్టర్ లో డేట్ మార్చేశాడు. ఉదయం నుండి మధ్యాహ్నం లోపల విష్ణు ఇందూరి ఇన్ని అవతారాలు ఎత్తుతుంటాడు. మనం గాలి ఎలా పీలుస్తామో అతను మాటలు అలా చెప్తాడు. దానిని నేను ఏమి వ్యతిరేకించడం లేదు. ఎలా బ్రతకాలనేది అతని ఇష్టం. తన చేతిలో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ ఉండొచ్చు. తన పరిధిలో పెద్ద విషయాలు జరగొచ్చు. కానీ నాకు తెలిసిన విష్ణు ఇందూరి గురించి నాకు తెలిసిన ప్రపంచానికి చెప్తున్నాను. వైఎస్ఆర్ – సీబీఎన్ ల ఇమేజ్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఎవరైనా వారికి నచ్చినట్లు సినిమాలు తీయొచ్చు. ఇప్పుడు ఈ టాపిక్ డిస్కషన్స్ లోకి వచ్చింది కాబట్టి రామ్ గోపాల్ వర్మ అయినా సినిమా తీయొచ్చు. విష్ణు ఇందూరిని తనకు నచ్చిన విధంగా నచ్చిన వారితో వెబ్ సిరీస్ తీయమని ఎంకరేజ్ చేస్తున్నాను. కానీ నా ఫిక్షనల్ ఐడియాస్ ని నా క్రియేటివిటీని మాత్రం దొంగిలిస్తే మాత్రం లీగల్ గా వెళ్తానని వార్నింగ్ ఇస్తున్నాను” అని దేవ కట్టా స్పష్టం చేసారు.