Templates by BIGtheme NET
Home >> Cinema News >> 2020 నా జీవితంలోనే బ్లాక్ ఇయర్ః హీరోయిన్

2020 నా జీవితంలోనే బ్లాక్ ఇయర్ః హీరోయిన్


ఎవరి జీవితంలోనైనా కష్ట కాలం ఉంటుంది.. కన్నీళ్లతో కుమిలిపోయిన సందర్భాలు ఉంటాయి.. అయితే.. 2020 సంవత్సరం మొత్తం తనకు చేదు జ్ఞాపకాలనే మిగిల్చిందని చెబుతున్నారు హీరోయిన్ రాయ్ లక్ష్మి. ఈ ఏడాది కాలంలో ఎన్నో కష్టాలను నష్టాలను అనుభవించానని కన్నీళ్లతో సావాసం చేశానని చెబుతోంది లక్ష్మి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె.. పై విధంగా స్పందించారు.

ప్రధానంగా కొవిడ్ వల్ల చాలా ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు. లాక్ డౌన్ వల్ల నాలుగు గోడలకే పరిమితమవడం ఒకెత్తయితే.. ఆ సమయంలో తన తండ్రి ఆరోగ్య పరిస్థితి మరింతగా కుంగదీసిందని చెప్పారు. ఆయన గొంతు క్యాన్సర్ తో బాధపడుతూ ఉండేవారని లాక్ డౌన్ కారణంగా వైద్యం అందించడానికి చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చిందని చెప్పారు.

ఆయన కోసం ఎంతో ప్రయత్నించినప్పటికీ.. కాపాడుకోలేకపోయామని ఆవేదన వ్యక్తంచేశారు రాయ్. తండ్రితో తనకు ఎంతో అనుబంధం ఉందని ఆయనను కోల్పోవడం జీవితంలో పెద్ద లోటు అని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో తాను డిప్రెషన్ లోకి కూడా వెళ్లానని చెప్పారు. ఆ కండీషన్ లోనుంచి బయటపడడానికి చాలా కాలం పట్టిందని చెప్పారు లక్ష్మి.

ప్రస్తుతం ‘ఉమెన్ సెంట్రిక్’ అనే చిత్రంలో నటిస్తున్నారు రాయ్ లక్ష్మి. దాదాపు ఏడాది కాలం తర్వాత కెమెరా ముందుకు రావడంతో అంతా కొత్తగా ఉందని తనకు తాను ఓ కొత్త నటిని అన్న భావన కలుగుతోందని చెప్పారు. ఈ సినిమాలో లైంగిక వేధింపులకు గురవుతున్న మహిళలకు అండగా నిలబడే యువతి పాత్ర పోషిస్తున్నట్టు తెలిపారు లక్ష్మి.