Templates by BIGtheme NET
Home >> Cinema News >> ‘సర్కారు వారి పాట’ స్టోరీ అదేనా..?

‘సర్కారు వారి పాట’ స్టోరీ అదేనా..?


సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ”సర్కారు వారి పాట”. పరశురామ్ పెట్లా దర్శకత్వం వహించనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ – జీఎమ్బీ ఎంటర్టైన్మెంట్స్ – 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్ కలిసి నిర్మించనున్నాయి. ఇందులో మహేష్ కి జోడీగా కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ తో సినిమాపై ఆసక్తిని కలిగించారు. మహేష్ మెడ మీద రూపాయి కాయిన్ టాటూతో కనిపించాడు. మోషన్ పోస్టర్ లో కూడా రూపాయి కాయిన్ ని ప్రధానంగా చూపిస్తూ సినిమా నేపథ్యం గురించి డిస్కషన్ చేసుకునేలా చేశారు. త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనున్న ‘సర్కారు వారి పాట’ స్టోరీ ఇదేనంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.

‘సర్కారు వారి పాట’ సినిమా బ్యాంక్ స్కాముల నేపథ్యంలో బ్యాంకుల నుంచి అప్పులు తీసుకుని విదేశాలకు పారిపోతోన్న ఆర్థిక నేరగాళ్లను టార్గెట్ చేస్తూ రూపొందనుందట. చిన్నప్పుడే అమ్మానాన్నలను కోల్పోయి అనాథగా మారిన హీరో.. చేతిలో ఓ రూపాయి పెట్టుకొని నిజాయితీగా అనుకున్న లక్ష్యాన్ని ఎలా సాధించడానే ఇతివృత్తంలో ఈ సినిమా ఉంటుందట. ఈ రెండింటిని పారలెల్ గా చూపిస్తూ పరశురామ్ ఆకట్టుకునే స్క్రీన్ ప్లే తో సినిమాని నడిపిస్తాడాని అంటున్నారు. మొత్తం మీద సందేశం అందిస్తూనే కమర్షియల్ ఎలిమెంట్స్ జత చేసి ఈ సినిమాని రూపొందించనున్నారు. ఏదేమైనా హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసి ఫుల్ ఫార్మ్ లో ఉన్న మహేష్.. ‘సర్కారు వారి పాట’ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంటాడాని ఫ్యాన్స్ నమ్మకంగా ఉన్నారు.

కాగా ‘సర్కారు వారి పాట’ ను వచ్చే ఏడాది ప్రారంభంలో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ముందుగా విదేశాల్లో భారీ షెడ్యూల్ కి ప్లాన్ చేసుకున్నప్పటికీ.. కరోనా చక్కబడకపోవడంతో ఆ షెడ్యూల్ ని వాయిదా వేసుకున్నారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు హైదరాబాద్ లోనే చిత్రీకరణ ప్రారంభించాలని నిర్ణయించుకున్నారు. దీని కోసం హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీలో ఓ భారీ సెట్ నిర్మాణం చేపడుతున్నారని సమాచారం. జనవరి నుంచి షూటింగ్ మొదలు పెట్టి.. ఆ తర్వాత యూఎస్ షెడ్యూల్ ను ప్రారంభించాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.