ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. మనదేశంలో కూడా కరోనా తీవ్రత రోజురోజుకి పెరుగుతూ వస్తోంది. కేసులు పెరగడంతో పాటు మరణాలు కూడా అధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. కాకపోతే రికవరీ అయ్యేవారి సంఖ్య కూడా ఆశాజనకంగా ఉండటం గమనించదగ్గ విషయ. ఇక కరోనా సాధారణ ప్రజలతోపాటు ప్రముఖులను సైతం వదిలిపెట్ట లేదు. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు సినీ బుల్లితెర ప్రముఖులు కరోనా బారిన పడటంతో సినీ ఇండస్ట్రీలో కలకలం రేపింది. వారిలో చాలామంది కరోనాను జయించి బయటపడ్డారు. ఈ క్రమంలో తాజాగా మెగా బ్రదర్ నాగబాబుకు కూడా కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది.
నాగబాబుకు కరోనా పాజిటివ్ వచ్చిందని గత రెండు రోజులుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు వాటిని నిర్ధారణ చేస్తూ తనకు కరోనా సోకిందని ఆయన సోషల్ మీడియాలో వెల్లడించారు. ”ఇన్ఫెక్షన్ అనేది ఎల్లప్పుడూ బాధగా ఉండాలి.. దీన్ని మీరు తోటివారికి సహాయపడే అవకాశంగా మార్చుకోవచ్చు” అని చెప్తూ కోవిడ్ -19 పాజిటివ్ వచ్చిందని.. కరోనాను జయించి ప్లాస్మా దానం చేస్తానని ఈ సందర్భంగా నాగబాబు ట్వీట్ చేశారు. దీనిపై మెగా అభిమానులు స్పందిస్తూ త్వరగా కోలుకోవాలని కామెంట్లు పెడుతున్నారు. నాగబాబు గత కొన్ని రోజులుగా ఓ ఛానెల్ లో ప్రసారం అయ్యే కామెడీ షోలో జడ్జిగా పాల్గొంటున్న సంగతి తెలిసిందే.