Templates by BIGtheme NET
Home >> Telugu News >> మైనింగ్ లీజుల రద్దు: టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట

మైనింగ్ లీజుల రద్దు: టీడీపీ నేతలకు హైకోర్టులో ఊరట


టీడీపీ ఎమ్మెల్యేల మైనింగ్ లీజులను రద్దు చేసిన ఏపీ ప్రభుత్వానికి షాక్ తగిలింది. ప్రకాశం జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలు నేతలకు గత చంద్రబాబు ప్రభుత్వం కేటాయించిన మైనింగ్ లీజుల్లో అక్రమాలు జరిగాయని ఏపీ ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. అక్రమ పద్ధతుల్లో మైనింగ్ కు పాల్పడడం.. బకాయిలు చెల్లించలేదని ప్రకాశం జిల్లా అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుల గ్రానైట్ క్వారీ లీజులను ఏపీ సర్కార్ రద్దు చేసింది. ప్రభుత్వం క్వారీయింగ్ లో లోపాలున్నాయని.. లీజులను రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం తెలిపింది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ క్వారీతోపాటు ఆయన సన్నిహితుల ఆరు క్వారీలు.. మాజీ ఎమ్మెల్యే పోతుల రామారావుకు చెందిన ఒక క్వారీ లీజును రద్దు చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది.

అయితే సదురు మైనింగ్ లో భారీ అక్రమాలున్నా నాడు టీడీపీలో చేరి ఈ నేతలంతా ఆరోపణలు కప్పిపుచ్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. అధికార పార్టీలో ఉంటూ ఐదేళ్ల పాటు మైనింగ్ లపై ఈగ వాలనీయకుండా చూసుకున్నారు.

గత ఎన్నికల్లో టీడీపీ ఎమ్మెల్యేలుగా పోటీచేసిన వీరంతా కొందరు గెలిచారు. మరికొందరు ఓడిపోయారు. ఈ క్రమంలోనే వైసీపీ సర్కార్ రావడంతో అక్రమాలపై కొరఢా ఝలిపించింది.

అయితే దీనిపై టీడీపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రభుత్వం మారడంతో కక్షసాధింపుగా మైనింగ్ లీజులు రద్దు చేశారని వాదించారు. దీంతో హైకోర్టు ఆ రద్దు ఉత్తర్వులను రద్దు చేస్తూ తీర్పునిచ్చింది. ఈ పరిణామం ఏపీ ప్రభుత్వానికి షాకింగ్ గా మారగా.. టీడీపీ నేతలకు మాత్రం ఊరటనిచ్చింది.