Templates by BIGtheme NET
Home >> Telugu News >> టార్గెట్ ఏపీ రాజధాని.. అందుకే పురంధేశ్వరికి పెద్ద పదవా?

టార్గెట్ ఏపీ రాజధాని.. అందుకే పురంధేశ్వరికి పెద్ద పదవా?


వైఎస్ఆర్ హయాంలో కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగారు సీనియర్ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి. నాడు చంద్రబాబుతో విభేదించి బయటకు వచ్చిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు కాంగ్రెస్ పార్టీలో కొనసాగారు.

అయితే ఏపీని కాంగ్రెస్ విభజించడంతో ఇక్కడ కాంగ్రెస్ పని ఖతమైంది. ఈ క్రమంలోనే బీజేపీలోకి దగ్గుబాటి కుటుంబం చేరింది. దాదాపు ఆరేళ్ల తర్వాత బీజేపీలో దగ్గుబాటి పురంధేశ్వరికి అత్యున్నత గౌరవం గుర్తింపు లభించింది. ఏకంగా అధికారంలో ఉన్న బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పురంధేశ్వరికి మంచి స్తానం దక్కింది.

2019 లోక్ సభ ఎన్నికల్లో విశాఖపట్నం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీచేసిన దగ్గుబాటి పురంధేశ్వరికి కనీసం డిపాజిట్లు కూడా రాలేదు. ఇదే పురంధేశ్వరిని వైఎస్ఆర్ 2009లో ఇదే విశాఖ లోక్ సభ సీటునుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించడం విశేషం. ఆ గెలుపుతో కాంగ్రెస్ కేబినెట్ లో పురంధేశ్వరి ఏకంగా కేంద్రమంత్రి కూడా అయ్యారు.

ప్రస్తుతం పురందేశ్వరికి మళ్లీ ఏకంగా బీజేపీలో పెద్ద పదవి దక్కడంతో రాజకీయాలపై దృష్టిసారించడానికి ఆస్కారం లభించింది. ఉత్తర ఆంధ్ర విశాఖపై పట్టును సాధించేందుకే ఈమెకు బీజేపీ అత్యున్నత పదవిని ఇచ్చినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం విశాఖనే ఏపీ రాజధానిగా జగన్ చేస్తుండడంతో అక్కడి నేతకు కీలక పదవి ఇచ్చి బీజేపీ ఫోకస్ ఇటు మరల్చిందని రాజకీయవర్గాల్లో ప్రచారం సాగుతోంది.