Templates by BIGtheme NET
Home >> Telugu News >> బీజేపీ చీఫ్ కు పాజిటివ్.. ప్రముఖుల గుండెల్లో రైళ్లు

బీజేపీ చీఫ్ కు పాజిటివ్.. ప్రముఖుల గుండెల్లో రైళ్లు


అత్యంత కీలకమైన స్థానాల్లో ఉన్న వారంతా అప్రమత్తంగా ఉండాల్సిన సమయమిది. కానీ.. అలా ఉన్నట్లు కనిపించరు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ ఏపీ సీఎం కానీ.. ఆ మాటకు వస్తే వాళ్లు.. వీళ్లు అన్న తేడా లేకుండా ఎవరికి వారు.. వారి స్థాయిల్లో కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకున్నట్లుగా కనిపించరు. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల వేళలో.. ప్రచారానికి పోటెత్తిన నేతలు.. వారిని చూసేందుకు.. వారి మాటలు వినేందుకు విరగబడిన ప్రజల్లో ఎంతమంది కరోనా గురించి ఆలోచించి కేర్ ఫుల్ గా ఉన్నారన్నది తెలిసిందే.

ఎవరు చేసుకున్న దానికి ఫలితం అనుభవించక తప్పదన్నట్లుగా ప్రముఖులు పలువురు ఒకరి తర్వాత ఒకరుగా కరోనా పాజిటివ్ బారిన పడటం తెలిసిందే. ఇప్పుడా జాబితాలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కరోనా-19 బారిన పడినట్లుగా వెల్లడించారు. సోషల్ మీడియాలో ఆయనో పోస్టు పెడుతూ.. తనకు కోవిడ్ లక్షణాలు కనిపించటంతో పరీక్ష చేయించుకున్నానని.. తనకు పాజిటివ్ గా తేలినట్లు చెప్పారు. అయితే.. తనకు ఆరోగ్యం బాగానే ఉందన్నారు.

వైద్యుల సలహాలను అనుసరించి కోవిడ్ మార్గదర్శకాల్ని పాటిస్తున్నట్లు చెప్పారు. ఇంటికే పరిమితమైనట్లుగా వెల్లడించారు. అదే సమయంలో.. గడిచిన కొద్ది రోజుల వ్యవధిలో తనను కలిసిన వారంతా కోవిడ్ పరీక్షలు చేయించుకోవాలన్న సలహాను ఇచ్చారు. తనకు పాజిటివ్ గా తేలిందన్న మాట తెలిసిన వెంటనే కేంద్రమంత్రులతో సహా బీజేపీ నేతలు.. ఇతర పార్టీ నేతలు ఆయన ఆరోగ్యం బాగుండాలని కాంక్షిస్తూ పోస్టులు పెట్టారు. అదే సమయంలో.. ఆయన్ను కలిసిన ప్రముఖుల గుండెల్లో రైళ్లు పరిగెత్తే పరిస్థితి. రానున్న కాలంలో నడ్డా పుణ్యమా అని.. ఎంతమంది బాధితులు తేలుతారో చూడాలి.