Templates by BIGtheme NET
Home >> Telugu News >> విశాఖ ఉక్కును కేటీఆర్ పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు?

విశాఖ ఉక్కును కేటీఆర్ పదే పదే ఎందుకు ప్రస్తావిస్తున్నట్లు?


అదే పనిగా ప్రశ్నిస్తూ.. విమర్శిస్తూ.. ఆరోపణలు గుప్పిస్తూ.. ఉక్కిరిబిక్కిరి చేస్తున్న తెలంగాణ బీజేపీకి దిమ్మ తిరిగేలా పంచ్ లు వేసేందుకు మంత్రి కేటీఆర్ కు అద్భుతమైన ఆయుధం విశాఖ ఉక్కు రూపంలో దొరికిందని భావిస్తున్నారు. దుబ్బాక.. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అన్నట్లుగా సాగిందన్నది మర్చిపోకూడదు. టీఆర్ఎస్ నేతల నోటి నుంచి వచ్చిన ప్రతి కామెంట్ కు పంచ్ ల రూపంలో రిప్లై ఇచ్చేవారు బీజేపీ నేతలు. అందుకు భిన్నంగా తాజాగా జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ చేతిలోకి వచ్చిన విశాఖ మాటను ఆయుధంగా మార్చుకోవటమే కాదు.. ప్రత్యర్థుల నోట వెంట మాట రాకుండా చేయటంలో సక్సెస్ అయ్యారు.

మోడీ పరివారానికి చెక్ పెట్టే సరికొత్త ఆయుధంగా విశాఖ ఉక్కు కర్మాగారం మారింది. ప్రశ్నలు సంధిస్తున్న కొద్దీ కమలనాథులకు షాకుల మీద షాకులు ఎక్కువ అవుతున్నాయి. అందుకే.. విశాఖ ఉక్కును కేటీఆర్ ఆయుధంగా మార్చుకున్నారని చెప్పాలి. దీనికి తోడు.. తెలంగాణలోనిఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి మనసులకు మరింత దగ్గర కావటమే కాదు.. పార్టీకి విశ్వసనీయమైన ఓటు బ్యాంక్ ను కేటీఆర్ సిద్ధం చేసినట్లుగా చెప్పాలి.

అందుకే.. కీలకమైన ఎన్నికల వేళలో విశాఖ ఉక్కు అంశాన్ని అదే పనిగా ప్రస్తావిస్తున్నారు. కేటీఆర్ నోటి నుంచి వచ్చే ప్రతి మాటకు కౌంటర్ ఇచ్చే అలవాటున్న నేతలు.. తాజాగా విశాఖ ఉక్కుపై కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలకు స్పందించకుండా మౌనంగా ఉంటున్నారు. దీన్నో అవకాశంగా తీసుకున్న కేటీఆర్.. బీజేపీ నేతలపై తాను సాధించిన పట్టును పదే పదే ప్రదర్శిస్తూ.. వారిని ఆత్మరక్షణలో పడేస్తున్నారు.

అవసరానికి తెలంగాణ నినాదాన్ని ఏ రీతిలో అయితే వాడతారో.. తమ రాజకీయ ప్రయోజనం కోసం ఏపీని సైతం అక్కున చేర్చుకునే టాలెంట్ తమకెంత ఉందన్న విషయాన్ని ఆయన తన చేతల్లో చూపిస్తున్నారని చెప్పాలి. విశాఖ అంశాన్ని టచ్ చేయటానికి ముందు వరకు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలపై ఆందోళనతో ఉన్న టీఆర్ఎస్.. అనుకోని వరంలా వచ్చిన విశాఖ ఉక్కు అంశాన్ని ప్రస్తావిస్తూ వార్ వన్ సైడ్ గా మార్చేశారన్న మాట టీఆర్ఎస్ నేతల నోటి నుంచి వినిపిస్తోంది.మరి.. ఇదెంత వరకు నిజమన్నది ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు తేలుస్తాయని చెప్పక తప్పదు.