Templates by BIGtheme NET
Home >> Telugu News >> మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి మరింత విషమం?

మాజీ హోంమంత్రి నాయిని ఆరోగ్య పరిస్థితి మరింత విషమం?


తెలంగాణ రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి టీఆర్ఎస్ సీనియర్ నాయకులు నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నాయినిని హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో వెంటిలేటర్పై చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. డయాలసిస్ చేస్తున్నామని.. వైద్యానికి సరిగ్గా స్పందించడం లేదని వైద్యులు చెబుతున్నారు.

గత నెల 28న కరోనా బారినపడ్డ నాయిని బంజారాహిల్స్లోని సిటీ న్యూరో సెంటర్ ఆసుపత్రిలో చేరారు. 16 రోజులపాటు చికిత్స పొందారు. వారం రోజుల కిందట పరీక్షలు నిర్వహించగా కరోనా నెగెటివ్ వచ్చింది. త్వరలోనే ఆయన కోలుకొని ఇంటికి వస్తారనుకునే సమయంలో ఒక్కసారిగా ఊపిరి తీసుకోవడం కష్టంగా మారినట్టు తెలిసింది.. దీంతో న్యూమోనియా సోకిందని డాక్టర్లు తేల్చారట. దీంతో ఆయనకు వెంటిలేటర్పై చికిత్స తీసుకుంటున్నట్లు తెలియవచ్చింది.

కాగా నాయిని భార్య అహల్య అల్లుడు విశ్రీనివాసరెడ్డి పెద్ద కుమారుడి మనువడికి కూడా కరోనా సోకి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నట్టు తెలిసింది.

కరోనా కంటే ముందే నాయినికి గుండె ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. ఇటీవల కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతిలో నాయిని పాల్గొన్నట్టు తెలిసింది. అక్కడే అభిమానులతో కాసేపు గడిపారట.. అక్కడే కరోనాకు గురయ్యారని ప్రచారం సాగుతోంది. ఈ సమయంలో మరోసారి నాయిని అస్వస్థతకు గురికావడం టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆందోళనకు కారణమవుతోంది.

నాయిని ఆరోగ్య పరిస్థితిపై మంత్రులు హరీష్ రావు నిరంజన్ రెడ్డి ఆరాతీశారు. కాగా నాయిని ఆరోగ్య పరిస్థితి అటు నాయిని కుటుంబం కానీ.. టీఆర్ఎస్ శ్రేణులు కానీ అధికారికంగా స్పందించలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.