Templates by BIGtheme NET
Home >> Telugu News >> పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్

పవన్ కళ్యాణ్ ఊసరవెల్లి: ప్రకాష్ రాజ్


విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయాలపై స్పందించారు. జనసేనాని పవన్ కళ్యాణ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. అవిప్పుడు దుమారం రేపుతున్నాయి. ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు సంచలనమయ్యాయి.

పవన్ కళ్యాణ్ పూటకో మాట మార్చే ఊసరవెల్లి అని ప్రకాష్ రాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అభిమానులు కార్యకర్తలకు బీజేపీకి ఓటేయ్యాలని చెబితే ఇక జనసేన పార్టీ ఎందుకని ప్రశ్నించారు.

జాతి హితం కోసం బీజేపీకి మద్దతు అంటే.. ఇక జనసేన పార్టీ ఎందుకని.. ఇంకొకరి భుజాన ఎక్కి ఈ రాజకీయాలు ఎందుకు అని ప్రకాష్ రాజ్ కడిగిపారేశారు. బీజేపీ వాళ్లు దారుణంగా మాట్లాడుతున్నారని.. హైదరాబాద్ లో అల్లకల్లోలం సృష్టిస్తున్నారని విమర్శించారు.

పవన్ కళ్యాణ్కు ఏమైందో నిజంగా నాకు అర్థం కావట్లేదని ప్రకాశ్ రాజ్ ఆడిపోసుకున్నారు. పవన్ నిర్ణయాలపై చాలా డిసప్పాయింట్ అయ్యానని విమర్శించారు. ‘నువ్వొక లీడర్.. మీకొక పార్టీ ఉంది.. మళ్లీ ఇంకో నాయకుడి వైపు వేలు చూపించడం ఏంటి? ఏపీలో గాని ఇంకో చోట గాని.. జనసేన ఓట్ షేర్ ఎంత.. బీజేపీ ఓటు షేర్ ఏంటి? 2014లో మీరే బీజేపీ వాళ్లు అద్భుతం ఇంద్రుడు చంద్రుడు అన్నారు. మళ్లీ గత ఎన్నికల్లో లేదు వాళ్లు ద్రోహులు అన్నారు! మళ్లీ ఇప్పుడు వీళ్లే నాయకులుగా కనిపిస్తున్నారు అంటున్నారు. అంటే ఇలా మూడు నాలుగు సార్లు మారుతున్నారంటే.. మీరు ఊసరవెల్లి అయి ఉండాలి కదా..’ అని విమర్శించారు.

‘పవన్ మీరు 2014లో బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు.. 2019లో కమ్యూనిస్టులకు మద్దతు నిచ్చారు.. ఇప్పుడు జీహెచ్ఎంపీ ఎన్నికల్లో ఏకంగా పోటీ నుంచి తప్పుకున్నారు.. ఇలా ఓ లీడర్ తీసుకునే నిర్ణయం కాదు’అని విమర్శించారు. దుబ్బాక ఎన్నికలో బీజేపీ గెలుపొందిన తరువాత ఆ పార్టీని జనసేన అధినేత పొగుడ్తూ వచ్చారు. ఆ తరువాత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే చివరి నిమిషంలో తమ పార్టీ ఎక్కడా పోటీ చేయలేదని ప్రకటించడంతో నలవువైపులా పవన్ పై ప్రకాష్ రాజ్ విమర్శలు గుప్పించారు.