Templates by BIGtheme NET
Home >> Telugu News >> వరద సాయంలో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందా ?

వరద సాయంలో రూ. 200 కోట్ల అవినీతి జరిగిందా ?


ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరదలకు సాయం అందించే పేరుతో అధికార టీఆర్ఎస్ నేతలు రూ. 200 కోట్ల అవినీతికి పాల్పడ్డారా ? అవుననే అంటున్నారు తెలంగాణా కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసి) ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ అధికారపార్టీపై రెచ్చిపోయారు. మామూలుగానే కేసీయార్ కుటుంబంపై మంచి దూకుడు చూనే రేవంత్ ఇపుడు జీహెచ్ఎంసి ఎన్నికలంటే ఊరుకుంటారా ? పైగా ఇటీవల కురిసిన భారీ వర్షాలకు రాజధాని పరిధిలో ప్రజలు పడిన ఇబ్బందుల పరిష్కారంలో ప్రభుత్వం ఫెయిలైంది.

వర్షాల బాధలను జనాలు మరచిపోకమునుపే గ్రేటర్ ఎన్నికలు వచ్చేయటంతో ఇపుడందరు ప్రభుత్వ వైఫల్యాలపైనే మండిపోతున్నారు. ఇందులో భాగంగానే రేవంత్ కూడా ప్రభుత్వ వైఫల్యాలపై ఫైర్ అయ్యారు. వర్షాలను వరదలను అడ్డం పెట్టుకుని టీఆర్ఎస్ గద్దలు వందల కోట్ల రూపాయలను దోచేసినట్లు తీవ్రంగా మండిపడ్డారు. పైగా వరద సాయం పేరుతో ఓ బాధితురాలు చనిపోవటానికి కూడా ప్రభుత్వమే కారణమన్నారు. మీ సేవా సెంటర్ల సామర్ధ్యం తెలిసి కూడా వేలాది మంది బాధితులను సెంటర్ల దగ్గరకు ఎలా పిలుస్తారంటూ నిలదీశారు.

వరద బాధితులను ఆదుకోవటంలో కేసీయార్ కేటీయార్ చొరవ చూపకపోయినా ఎన్నికల్లో గెలవాలనే ఆతృత మాత్రం వాళ్ళల్లో కనబడుతోందంటూ ఎద్దేవా చేశారు. బాధితులను ఆదుకోవటంపైన కాకుండా తండ్రి కొడుకుల దృష్టి కేవలం ఎన్నికల్లో గెలవటం పైన ఉండటం దురదృష్టమన్నారు. పేదలతో ఆటలాడుకుంటున్న తండ్రీ కొడుకులతో పాటు టీఆర్ఎస్ నేతలను జనాలు చొక్కాలు పట్టుకుని నిలదీయాలంటూ పిలుపిచ్చారు.

గ్రేటర్ ఎన్నికల్లో జనాలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ప్రభుత్వ అవినీతి ప్రశ్నిస్తుందని భరోసా ఇచ్చారు. రేవంత్ చెబుతున్నది బాగానే ఉంది కానీ ముందు మెజారిటి డివిజన్లను గెలుచుకోవాలి కద. ఎందుకంటే 150 డివిజన్లలో పోటీ చేస్తున్న అభ్యర్ధుల విజయానికి కాంగ్రెస్ నేతలు ఏమాత్రం చిత్తశుద్దితో పనిచేస్తారనే విషయం అనుమానమే. కాంగ్రెస్ లో ఉన్నన్ని గ్రూపుల గోల మరో పార్టీలో కనబడదు. ఎంతసేపు టికెట్ల కోసం నిధుల కోసం పెత్తనం కోసం పాకులాడటమే తప్ప తమ అభ్యర్ధుల గెలుపుకు సిన్సియర్ గా పనిచేసే ముచ్చట కాంగ్రెస్ లో కనబడటం లేదు. ఈ నేపధ్యంలో రేవంత్ ఏమి చేయగలరో చూద్దాం.