Templates by BIGtheme NET
Home >> Telugu News >> చైనా బార్డర్లో టెన్షన్…పరేషానే

చైనా బార్డర్లో టెన్షన్…పరేషానే


భారత్కు సరిహద్దు దేశాల నుంచి సమస్యలు తప్పడం లేదు. లడఖ్ సరిహద్దులో చైనా మరోసారి ఘర్షణ వాతావరణాన్ని సృష్టించింది. ఆ దేశ సైనికులు వాస్తవాధీన రేఖను దాటి భారత్ భూభాగంలోకి వచ్చేందుకు మళ్లీ ప్రయత్నించారు. అయితే చైనా సైనికుల కదలికలపై ముందు నుంచి నిఘా ఉంచిన భారత్ ఆర్మీ ధీటుగా బదులిచ్చింది. దీంతో మరోసారి రెచ్చగొట్టేందుకు ప్రయత్నించిన చైనా సైనికుల ప్రయత్నాలు సాగలేదు.

లడఖ్ సరిహద్దులోని పాంగోంగ్ త్సో సరస్సు వద్ద జరిగిన ఘటన గురించి రక్షణ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29 రాత్రి నుంచి 30వ తేదీ ఉదయం వరకు ఆకస్మిక పరిణామాలు చోటు చేసుకున్నాయి. సుమారు 200 మంది చైనా సైనికులు ఒక వాహనంలో ఈ నెల 29 రాత్రి 11 గంటలకు లడఖ్ సరిహద్దులోని భారత్ సైనిక పోస్టు వద్దకు వచ్చారు. దీని గురించి ముందుగానే సమాచారం అందుకున్న భారత ఆర్మీ దీటుగా ఎదుర్కొనేందుకు సన్నాహాలు చేసింది. దీంతో భారత్ సైనిక పోస్టు వద్దకు చేరిన చైనా సైనికులు భారత బలగాలను చూసి కంగుతిన్నారు. అనంతరం కొంతసేపు భారత్ సైనికులతో తోపులాటకు పాల్పడ్డారు.

మరోవైపు చైనా సైనికులు ముందుకు రాకుండా భారత జవాన్లు నిలబడి వారిని అడ్డుకున్నారు. ఇరువురు సైనికులు కొన్ని గంటల పాటు అక్కడే అలాగే ఉన్నారు. భారత్ సైనికులు కూడా భారీగానే ఉండటంతో చైనా సైనికులు వెనక్కి తగ్గారు. తమ వాహనంలో తిరిగి అక్కడి నుంచి వెళ్లిపోయారు. కాగా ఈ తోపులాటలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని ఆర్మీ వర్గాలు తెలిపాయి.

జూన్ 15న లడఖ్లోని గల్వాన్ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో తెలంగాణకు చెందిన కర్నల్ సంతోష్ బాబుతో సహా 20 మంది జవాన్లు అమరులైన సంగతి తెలిసిందే. దీంతో నాటి నుంచి సరిహద్దులో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. అయితే సరిహద్దులో సైనిక బలగాలను తగ్గించుకునే అంశంపై ఇరు దేశాల మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు జరుగుతున్నాయి. అయినప్పటికీ చైనా తన బుద్ధి మార్చుకోవడం లేదు. తాజాగా భారత్ భూటాన్ చైనా సరిహద్దుల్లో హెలిపోర్ట్ను పీఎల్ఏ దళాలు నిర్మిస్తున్నాయి. సర్ఫేస్ టు ఎయిర్ మిస్సైళ్ల కేంద్రాలను చైనా తీర్చిదిద్దుతున్నట్లు తెలుస్తోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా చైనా ఆర్మీ చేస్తున్న కుట్రలు బయటపడుతున్నాయి. తాజాగా ఇంటెలిజెన్స్ సంస్థ డెట్రెస్ఫా తన ట్విట్టర్లో చైనా సైనిక దళాలు నిర్మిస్తున్న కట్టడాల చిత్రాలను పోస్టు చేసింది.

డోక్లామ్తో పాటు సిక్కిం సెక్టార్ల సమీపంలో ఆ హెలిప్యాడ్ నిర్మాణం జరుగుతోంది. నాకు లా డాక్లా పాస్కు 100 కిలోమీటర్ల దూరంలో ఆ హెలిపోర్ట్ ఉంది. అన్ని తరహాల వాతావరణాన్ని తట్టుకునే విధంగా నిర్మాణం సాగుతున్నది. తమ నిఘా వ్యవస్థను చైనా పెంచుకుంటున్నట్లు తెలుస్తోంది. అనుమానిత హెలిపోర్ట్లో మిస్సైల్ సదుపాయాలను రేడార్ వార్నింగ్ సిస్టమ్ను ఏర్పాటు చేస్తున్నారు. ఇదిలాఉండగా ప్రధాని నరేంద్ర మోదీ సైతం తూర్పు లదాక్లో ప్రస్తుత పరిస్థితిపై వరుసగా కీలక భేటీలు జరిపినట్లు సమాచారం. కేంద్ర హోం రక్షణ శాఖలకు చెందిన పలువురు ఉన్నతాధికారులు తూర్పు లదాక్ తోపాటు తాజాగా ఉద్రిక్తతలు చోటుచేసుకున్న చుశూల్ సెక్టార్లపై ప్రధానికి వివరించినట్లు తెలుస్తోంది.