Templates by BIGtheme NET
Home >> Telugu News >> ఖైరతాబాద్‌ గణేశుడిని ఆన్‌లైన్‌లో దర్శించుకోండి!

ఖైరతాబాద్‌ గణేశుడిని ఆన్‌లైన్‌లో దర్శించుకోండి!


హైదరాబాద్‌లోని ఖైరతాబాద్‌ గణేశుడికి ఎంతో ప్రాముఖ్యం ఉన్న సంగతి తెలిసిందే. ఏటా ఈ వినాయకుడ్ని దర్శించుకొనేందుకు భక్తులు బారులు తీరుతుంటారు. ఈ ఏడాది మాత్రం కరోనా కారణంగా ఉత్సవాలు అంత ఘనంగా చేయకపోతున్నప్పటికీ ఆ గణేషుడికి ప్రాధాన్యం మాత్రం తగ్గలేదు. భారీ ఎత్తున విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే జనం ఎగబడి వస్తారనే అంచనాల మధ్య ఈసారి 9 అడుగుల ప్రతిమతో సరిపెట్టారు. అయినా దర్శనానికి భక్తులు బాగానే పోటెత్తుతున్నారు.

ఈ క్రమంలో ఖైరతాబాద్ గణేషుడి దర్శనానికి భక్తులెవరూ రావొద్దని ఉత్సవ సమితి విజ్ఞప్తి చేసింది. ఎక్కువ సంఖ్యలో భక్తులు రావడం వల్ల కొవిడ్‌ నిబంధనల ఉల్లంఘన జరుగుతోందని.. ఈ క్రమంలో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందని వివరించింది. కాబట్టి, భక్తులు ఆన్‌లైన్‌లో www.ganapathideva.org వెబ్‌సైట్‌ ద్వారా గణేశుడ్ని దర్శించుకోవాలని సూచించింది.

మరోవైపు ఖైరతాబాద్‌లో భక్తుల రద్దీ ఎక్కువ కావడంతో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలీసులు ఆంక్షలు విధించారు. దీంతో దర్శన సమయాలను కూడా కుదించారు. ఉదయం 5 గంటల నుంచి 10.30 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి 10 గంటల వరకు అతికొద్ది మందికి మాత్రమే దర్శనానికి అవకాశం ఇవ్వనున్నట్లు ఉత్సవ సమితి స్పష్టం చేసింది. కరోనా రక్కసి త్వరగా పోవాలని ఖైరతాబాద్‌ గణేశుడి చెంత నిత్యహోమాన్ని చేస్తున్నారు.