దగ్గుబాటి హీరో వెంకటేష్ కి క్రికెట్ అంటే ఎంత పిచ్చో చెప్పాల్సిన పనే లేదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడ టీమిండియా ఆడినా నేరుగా స్టేడియమ్ కే వెళ్లి చూసొస్తుంటారు. వెంకీ కజిన్ నాగార్జునకు కానీ.. అఖిల్ కి కానీ క్రికెట్ అంటే అపారమైన అభిమానం. అఖిల్ అండర్ 19 టీమ్ కి ప్రిపేరైన సంగతి తెలిసిందే. అలానే దగ్గుబాటి రానా క్రీడాభిమాని. క్రికెట్.. కబడ్డీ.. ఫుట్ బాల్ లాంటి క్రీడలను రానా అమితంగా ఇష్టపడతాడు. తనను భళ్లాలుడిగా చూపించిన రాజమౌళి క్రికెట్ ని ఎంతగా ఇష్టపడతారో తెలిసినదే.
ఫుట్ బాల్ క్రీడకు దగ్గుబాటి రానా వీరాభిమాని. ఇంతకుముందు ప్రోకబడ్డీని ఎంకరేజ్ చేసినట్టే ఇప్పుడు ఫుట్ బాల్ క్రీడకు తనవంతుగా ప్రచారం చేస్తున్నారు. భారతదేశంలో ఫుట్ బాల్ ఆట ప్రాముఖ్యతను పెంచేందుకు తనవంతుగా బ్రాండ్ ప్రమోషన్ చేస్తున్నారు. తాజాగా అతడు హైదరాబాద్ టీమ్ ని అంతర్జాతీయ ఫుట్ బాల్ కంపెనీతో లింకప్ చేసిన సంగతిని వెల్లడించారు. ఇండియన్ సూపర్ లీగ్ లోని హైదరాబాద్ ఎఫ్సి జట్టును ప్రపంచంలోని ఉత్తమ ఫుట్బాల్ క్లబ్ లలో ఒకటైన బోరుస్సియా డార్ట్ మండ్ తో లింకప్ చేశాడు. తాజాగా డీల్ పూర్తయింది. ఇకపై డార్ట్ మండ్ క్లబ్ బ్రాండ్ తో హైదరాబాద్ ఎఫ్.సి జట్టు బలం పెరిగినట్టే. దేశంలో ఈ అరుదైన క్రీడ అభివృద్ధికి ఇది శుభసూచికంగా భావించాలి.
తాజాగా హైదరాబాద్ జట్టు యజమానుల్లో ఒకరైన రానా ఈ పార్ట్ నర్ షిప్ గురించి వివరాల్ని తెలిపారు. ఆగస్టు 20 న బోరుస్సియా డార్ట్ మండ్ వర్చువల్ ఆసియా టూర్ లో భాగస్వామ్య ఒప్పందానికి సంబంధించిన మరిన్ని వివరాల్ని వెల్లడించనున్నారు. హైదరాబాద్ జట్టుకి ఇప్పుడు భారతదేశ వ్యాప్తంగా ఇమేజ్ పెరిగినట్టే. దేశంలో ఫుట్ బాల్ వృద్ధికి ఇది దోహదపడుతుందని క్రీడాభిమానులు అంచనా వేస్తున్నారు. అమెరికా.. స్వీడన్.. డచ్.. చైనా వంటి దేశాల్లో ఈ ఆట ప్రాముఖ్యత తెలిసిందే. మన దేశంలో ఫుట్ బాల్ ఆట భవిష్యత్ కి ఇది నాంది అనే చెప్పాలి. రానా ఇటీవలే తాను ప్రేమించిన మిహీక బజాజ్ ని పెళ్లాడారు. లాక్ డౌన్ అనంతరం పెండింగ్ ప్రాజెక్టులపై దృష్టి సారించనున్నారు. పనిలో పనిగా క్రీడల్లోనూ పెట్టుబడులతో హవా సాగించేందుకు తెలివైన ప్లాన్ తో దూసుకెళుతున్నారు.