Templates by BIGtheme NET
Home >> Cinema News >> డ్రగ్స్ కేసు : ఎన్సీబీ నోటీసులు అందుకున్న రకుల్..? రేపు విచారణకు హాజరు..?

డ్రగ్స్ కేసు : ఎన్సీబీ నోటీసులు అందుకున్న రకుల్..? రేపు విచారణకు హాజరు..?


బాలీవుడ్ లో వెలుగులోకి వచ్చిన డ్రగ్స్ వ్యవహారంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే రకుల్ ప్రీత్ సింగ్ తో పాటు బాలీవుడ్ హీరోయిన్స్ దీపికా పదుకునే – శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ లకు నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) సమన్లు జారీ చేసిందని తెలుస్తోంది. వీరితోపాటు దీపికా మేనేజర్ కరిష్మా కపూర్ – ఫ్యాషన్ డిజైనర్ సిమోన్ ఖంబట్టా – సుశాంత్ మేనేజర్ శ్రుతి మోదీలను కూడా ఎన్సీబీ విచారణకు పిలిచింది. మూడు రోజుల్లో తమ విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది.

అయితే రకుల్ కు నోటీసులు అందలేదని.. హైదరాబాద్ లో కానీ ముంబైలో కానీ తనకు ఎన్సీబీ పంపిన సమన్లు అందలేని రకుల్ టీమ్ తెలిపినట్లు వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఎన్సీబీ అధికారి ఒకరు.. ‘రకుల్ కు సమన్లు జారీ చేశాం.. తను ఫోన్ లో అందుబాటులోకి రాలేదు. సోషల్ మిడియా ప్లాట్ ఫార్మ్స్ ద్వారా ఆమెను సంప్రదించాం. ఆమె నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన లేదు’ అని చెప్పనట్లు వార్తలు వచ్చాయి. అయితే తాజాగా రకుల్ ప్రీత్ తనకు ఎన్సీబీ నోటీసులు అందాయని.. హైదరాబాద్ లో ఉన్న ఆమె రేపు విచారణకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో రేపు రకుల్ ప్రీత్ సింగ్ – దీపికా పడుకునే ఇద్దరు ఎన్సీబీ ఎదుట హాజరుకానున్నారు. ఎఫ్ఐఆర్ 15/20 16/ 20 కింద దీపికా – రకుల్ లను నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో విచారించనున్నట్లు తెలుస్తోంది. ఈ విచారణ కోసం ఇప్పటికే దీపిక పూర్తిగా సన్నద్ధమైనట్లు తెలుస్తోంది. ఇప్పటికే న్యాయ నిపుణులను సలహా తీసుకున్న దీపిక న్యాయపరమైన చర్యలు ఎదుర్కోవడానికైనా సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. ఇక సెప్టెంబర్ 26న శ్రద్ధా కపూర్ – సారా అలీఖాన్ లను ఎన్సీబీ అధికారులు విచారించనున్నారని సమాచారం.